

ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ పృథ్వీ షా ఓ ఇంటివాడయ్యాడు. ఇంటివాడయ్యాడంటే వివాహం చేసుకున్నాడని పొరపాటుపడేరు.! ఓ ఖరీదైన ఇళ్లును కొనుక్కొని తన కలను నెరవేర్చుకున్నాడు. ముంబైలోని అత్యంత ఖరీదైన బాంద్రా ప్రాంతంలో పృథ్వీ షా రూ.10.5 కోట్ల భారీ ధర పెట్టి అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశాడు.
ప్రీమియమ్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో ఈ ఢిల్లీ ఓపెనర్ ఫ్లాట్ కొనుగోలు చేశాడని ఎకనామిక్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. పృథ్వీ షా కొనుగోలు చేసిన ఆ ఫ్లాట్ విలువ అతని ఐదేళ్ల ఐపీఎల్ జీతంతో సమానమని తెలిపింది. బాంద్రాలో కేసీ రోడ్లోని ప్రాజెక్ట్ 81 ఆరెట్ అపార్ట్మెంట్లో ఎనిమిదో ఫ్లోర్ను పృథ్వీ షా కొనుగోలు చేసాడు. ఈ ప్రాపర్టీని పిరమిడ్ డెవలపర్స్, అల్ట్రాస్పేస్ సంయుక్తంగా నిర్మించాయి.
పృథ్వీ కొనుగోలు చేసిన ఫ్లాట్ 2209 స్వ్కేర్ఫీట్లో కార్పెట్ ఏరియా.. 1654 స్క్వేర్ఫీట్లో టెర్రస్తో అత్యంత విశాలంగా ఉంటుంది. కాగా అంతేకాదు పృథ్వీ షాకు విశాలమైన మూడు కార్ పార్కింగ్ స్లాట్స్ ఇస్తారు. ఇక రూ. 52.50 లక్షలతో మార్చి 31నే స్టాంప్ డ్యూటీ చేయించగా.. ఏప్రిల్ 28న పృథ్వీ షా పేరుతో ఫ్లాట్ రిజిస్టర్ అయ్యింది.
ఇక 2018 అండర్ 19 ప్రపంచకప్ గెలిపించిన సారథిగా ఐపీఎల్లోకి దూసుకొచ్చిన పృథ్వీ షాను.. 2018 ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఢిల్లీకే ఆడిన పృథ్వీ షా.. విధ్వంసకర బ్యాటింగ్తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. దాంతో ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ముందు ఢిల్లీ టీమ్ అతన్ని రూ.7.5 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2022 సీజన్లో డేవిడ్ వార్నర్తో కలిసి జట్టుకు మంచి ఆరంభాలు అందిస్తున్నాడు. అయితే ఫస్టాఫ్లో సూపర్ ఫామ్ కనబర్చిన పృథ్వీ సెకండాఫ్లో విఫలమవుతున్నాడు.