
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ సహనం కోల్పోయాడు. భారీ లక్ష్య చేధనలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో కలిసి మంచి శుభారంభం అందించిన ఫించ్ ఈ సీజన్లో తొలి హాఫ్ సెంచరీ బాదాడు. 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫించ్ జోరుకు ప్రసిధ్ కృష్ణ బ్రేక్ వేసాడు. దాంతో సహనం కోల్పోయిన ఫించ్.. ప్రసిధ్ కృష్ణపై నోరు పారేసుకున్నాడు. క్రీజును వీడుతూ.. ప్రసిధ్ను తన సూటి పోటీ మాటలతో కవ్వించాడు.
దీనికి ప్రసిధ్ కృష్ణ సైతం తనదైన శైలిలో కౌంటరిచ్చాడు. వారి మధ్య జరిగిన సంభాషణ ఏంటో తెలియదు కానీ ప్రసిధ్ హవభావాలను చూస్తే మూసుకోని పోరా.. అని ఫించ్ను అన్నట్లు అర్థమవుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అసలేం జరిగిందంటే..? ప్రసిధ్ వేసిన 9వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదిన ఫించ్.. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్ చివరి బంతిని వైడ్ బౌన్సర్గా ప్రసిధ్ వేయగా.. ఫించ్ అప్పర్ కట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బ్యాక్ వర్డ్ పాయింట్ వైపు గాల్లోకి లేచింది. కరుణ్ నాయర్ అద్భుతంగా అందుకున్నాడు. ఔటైన ఫ్రస్టేషన్లో ఫించ్ యువ పేసర్పై నోరు పారేసుకున్నాడు.
సోమవారం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ 7 పరుగులతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 217 పరుగులు చేసింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఇదే భారీ టార్గెట్. జోస్ బట్లర్(61 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో 103) శతకానికి అండగా సంజూ శాంసన్(19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38) షిమ్రన్ హెట్మైర్(13 బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్సర్లతో 26 నాటౌట్) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2 వికెట్లు తీయగా..శివం మావి, ప్యాట్ కమిన్స్, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 19.4 ఓవర్లలో 210 పరుగులకు కుప్పకూలింది. శ్రేయస్ అయ్యర్(51 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 85), ఆరోన్ ఫించ్(28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్(5/40) హ్యాట్రిక్ వికెట్తో పాటు తొలిసారి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. మెక్కాయ్ రెండు వికెట్లు తీయగా.. ప్రసిధ్, అశ్విన్ తలో వికెట్ తీసారు.