
రెండు గ్రూప్లుగా..
ఐపీఎల్లో ఇంతకు ముందు ప్రదర్శనల ఆధారంగా పది జట్లను రెండు గ్రూప్లుగా విడదీశారు. గెలిచిన టైటిల్స్, ఫైనల్ చేరిన సందర్భాలను బట్టి ప్రతీ టీమ్కు ర్యాంక్ ఇచ్చారు. గ్రూప్ఏలో వరుసగా ముంబై ఇండియన్స్(5 టైటిల్స్), కేకేఆర్(2), రాజస్థాన్ (1టైటిల్), ఢిల్లీ(ఒకసారి ఫైనల్), లక్నోలను చేర్చారు. గ్రూప్ బిలో వరుసగా చెన్నై సూపర్ కింగ్స్(4 టైటిల్స్), హైదరాబాద్(1 టైటిల్), బెంగళూరు, పంజాబ్, గుజరాత్ను ఉంచారు.
ప్రతీ జట్టు తమ గ్రూప్లోని నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్లు, మరో గ్రూప్లోని ఒక జట్టుతో (గ్రూప్లో అదే స్థానంలో ఉన్న) రెండేసి మ్యాచ్ లు ఆడుతుంది. ఇవి 10 మ్యాచ్లు అవుతాయి. మరో గ్రూప్లోని మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. కలిసి మొత్తం 14 మ్యాచ్లు అవుతాయి. ఉదాహరణకు ముంబై ఇండియన్స్ 'ఎ' గ్రూప్లోని నాలుగు టీమ్లతో పాటు గ్రూప్ 'బి'లో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్తో రెండు మ్యాచ్లలో తలపడుతుంది. మిగిలిన నాలుగు టీమ్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది.

స్ట్రాంగ్ టీమ్స్తో రెండేసి మ్యాచ్లు..
అయితే ఈ గ్రూప్ విధానంపై ముంబై ఇండియన్స్ అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉందని టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తెలిపాడు. నయా ఫార్మాట్ ప్రకారం ముంబై ఇండియన్స్ లీగ్ దశలో తమ గ్రూప్లోని కేకేఆర్, రాజస్థాన్, ఢిల్లీ, లక్నోలతో పాటు గ్రూప్ బి టాపర్ చెన్నై సూపర్ కింగ్స్తో రెండేసి మ్యాచ్లు ఆడుతుంది. మిగతా టీమ్స్ అయిన సన్రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్లతో ఒక్కో మ్యాచే ఆడనుంది. ఇదే ముంబైకి తీవ్ర నష్టం చేయనుందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

ఫార్మాట్ సూపర్..
లీగ్లో బలంగా కనిపిస్తున్న టీమ్స్తో రెండేసి మ్యాచ్లు ఉండి, కొంచెం బలహీనంగా ఉన్న జట్లతో ఒక్కో మ్యాచ్ ఉండటం ఆ జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తోందని చోప్రా పేర్కొన్నాడు. ఇది ఆ జట్టు మేనేజ్మెంట్ను తీవ్రంగా నిరాశపరిచే అంశమని తెలిపాడు. ఐసీసీ ఉపయోగించే టోర్నీ విధానం కంటే ఇదే బాగుందని చోప్రా అభిప్రాయపడ్డాడు. ప్రతీ గ్రూప్లో టాప్లో నిలిచిన జట్లు నాకౌట్ దశకు చేరుతాయని చెప్పుకొచ్చాడు. ఈ విధానం వల్ల టోర్నీలో ఆడే ప్రతీ జట్టు ఇతర జట్లతో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడుతుందని, 14 మ్యాచ్ల్లో అత్యుత్తమ టీమ్ నాకౌట్ చేరుతుందని చెప్పాడు.

సొంతమైదానంలో మ్యాచ్లు..
70 లీగ్ మ్యాచ్ల్లో 20 మ్యాచ్లు ముంబై వాంఖెడే స్టేడియంలో, 20 మ్యాచ్లు ముంబై డీవై పాటిల్ స్టేడియంలో, 15 మ్యాచ్లు ముంబై బ్రబోర్న్ స్టేడియంలో, 15 మ్యాచ్లు పుణే స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇది ముంబై ఇండియన్స్కు అడ్వాంటేజ్ అవుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. . ఈ విషయాన్ని ఫ్రాంచైజీలు సైతం బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. సొంతమైదానంలో ఆడటం ముంబై ఇండియన్స్కు కలిసొచ్చే అంశమని కూడా నెటిజన్లు అంటున్నారు.


Click it and Unblock the Notifications












