
ముంబై: భారత్లో 'క్రికెట్ ఓ మతం అయితే ఐపీఎల్ ఓ పండుగ'. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ ఏడాది జరిగే ఐపీఎల్ సక్సెసే దీనికి నిదర్శనం. క్రికెట్ అంటే పడి చచ్చే ఫ్యాన్స్ కోట్లలో ఉన్నారు కాబట్టే ఐపీఎల్ వరల్డ్ ఫేమస్ క్రికెట్ లీగ్ అయింది. కరోనా కారణంగా గత రెండేళ్లు టీవీల్లోనే చూసిన అభిమానులు.. ఈ సారి అవకాశం లభించడంతో మైదానాలకు వచ్చి తమకు నచ్చిన ఆటను ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరూ క్రికెట్తో తాము అభిమానించే ఆటగాళ్లపై ఉన్న ప్రేమను వివిధ రూపాల్లో వ్యక్త పరుస్తున్నారు.
ఇప్పటికే చాలా మంది విరాట్ కోహ్లీ అభిమానులు.. అతను సెంచరీ చేస్తే గానీ పెళ్లి చేసుకోమని శపథం చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ తరహాలోనే సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఓ అభిమాని ప్రదర్శించిన ప్లకార్డు వైరల్గా మారింది. చాలా ఆసక్తికరంగా ఉన్న ఈ ప్లకార్డు క్రికెట్ అభిమానులను కట్టిపడేస్తుంది. ఈ మ్యాచ్కు హాజరైన ఓ డైహార్డ్ ఫ్యాన్.. ఓ ప్లకార్డును ప్రదర్శించాడు. దానిపై తన ప్రేయసి 'ఐపీఎల్ ముఖ్యమా? గర్ల్ ఫ్రెండా?' అని అడిగిందని, తాను మాత్రం ఐపీఎల్ అనే చెప్పి మ్యాచ్కు హాజరయ్యానని పేర్కొన్నాడు. దాంతో ఈ ఫొటో నెట్టింట వైరల్గా మారింది. మరోసారి ఈ ఘటన భారత్లో క్రికెట్కు ఉన్న ఆదరణ ఎలాంటిదో తెలియజేసింది.
ఓ ఆర్సీబీ లేడీ ఫ్యాన్ సైతం ఇలానే ఆ జట్టు టైటిల్ గెలిచే వరకు పెళ్లి చేసుకోనని శపథం చేసింది. దీనికి సంబంధించిన ప్లకార్డు కూడా వైరల్గా మారింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ 7 వికెట్లతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. నితీశ్ రాణా (36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 54), ఆండ్రీ రసెల్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 49 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడగా, నటరాజన్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం హైదరాబాద్ 17.5 ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగులు చేసి గెలిచింది.
'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' రాహుల్ త్రిపాఠి (37 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 71) మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగగా, మార్క్రమ్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 68 నాటౌట్) కూడా జోరు ప్రదర్శించాడు. వీరిద్దరు మూడో వికెట్కు 54 బంతుల్లో 94 పరుగులు జోడించి హైదరాబాద్ విజయానికి బాటలు వేశారు.