
ముంబై: ఐపీఎల్లోనే రిచెస్ట్ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్ తమ ఆటగాళ్ల రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కరోనా వైరస్ బారిన పడకుండా ప్రత్యేకంగా ఔట్డోర్ బయో సెక్యూర్ను సృష్టించింది. జియో వరల్డ్ గార్డెన్లో దాదాపు 13వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఆటగాళ్లు, సిబ్బందికి కుటుంబ సభ్యులతో సహా రిఫ్రెష్ కావడానికి ఈ 'బయో సెక్యూర్ ఎంఐ ఎరేనా'ను ఏర్పాటు చేసింది.
ఐపీఎల్ జరిగేది సొంత ప్రదేశంలో అయినప్పటికీ ఆటగాళ్లకు మానసికంగా, శారీరకంగా విశ్రాంతి తీసుకోవడమే కాకుండా వినోదం అందించడానికి ముంబయి ఫ్రాంచైజీ ఏర్పాట్లు చేసింది. బీసీసీఐ 'బయో సెక్యూర్ బబుల్'లో భాగంగానే 'ఎంఐ ఎరేనా' ఉంటుందని ముంబయి ఫ్రాంచైజీ ప్రకటన వెల్లడించింది.'ఎంఐ ఎరేనా'లో మైదానం, బాల్ కోర్ట్, బాక్స్ క్రికెట్, ఫుట్ వాలీబాల్, గోల్ఫ్ డైవింగ్ రేంజ్, ఎంఐ బ్యాటిల్గ్రౌండ్, మినీ గోల్ఫ్, ఎంఐ కేఫ్, కిడ్స్ జోన్ తదితర సదుపాయాలు ఉన్నట్లు ముంబై ఇండియన్స్ తెలిపింది.
'ఆటగాళ్లు ఒకరినొకరు బాగా కనెక్ట్ అయ్యేందుకు ఎంఐ ఎరేనాను సృష్టించాం. గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సవాళ్లను ఎదురయ్యాయి. 'ఒకే కుటుంబం' అనేది ముంబై ఇండియన్స్ నినాదం. అందులో భాగంగా ప్రతి ఒక్కరినీ సురక్షితంగా, సంతోషంగా ఉంచడమే మా ప్రాధాన్యం, బాధ్యత" అని ముంబై ఇండియన్స్కు చెందిన ఓ అధికారి తెలిపారు.
మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఐపీఎల్లోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ఏదైనా ఉందా? అంటే అది ముంబై ఇండియన్సే. టోర్నీ చరిత్రలోనే ఆ జట్టు అత్యధికంగా ఐదు సార్లు టైటిల్ గెలిచింది. ముఖ్యంగా రోహిత్ శర్మ సారథ్యంలోని ఆ జట్టు.. గత కొన్నేళ్లుగా ఐపీఎల్ను శాసిస్తోంది. గత నాలుగు సీజన్లలో రెండు సార్లు(2019, 2020) టైటిల్ గెలుచుకుంది. అయితే వరల్డ్ బెస్ట్ టీమ్గా గుర్తింపు పొందిన ముంబైకి.. మెగా వేలం రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. కొత్తగా రెండు జట్లు లీగ్లోకి రావడంతో మెగా వేలం అనివార్యమవ్వగా.. బలమైన ముంబై కోర్ టీమ్ చెల్లాచెదురైంది.
దాంతో ఎన్నడూ లేని విధంగా పేపర్పై ముంబై ఇండియన్స్ బలహీనంగా కనిపిస్తోంది. జట్టులో పేరుమోసిన ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ లేడు. పైగా జట్టులో సగానికిపైగా కుర్రాళ్లే ఉన్నారు. దాంతో రోహిత్ సేన ఐపీఎల్ 2022 భవితవ్యం కుర్రాళ్ల ప్రదర్శనపైనే ఆధారపడి ఉంది. అయితే అనామక ఆటగాళ్లను స్టార్లుగా మార్చడం ముంబైకి కొత్తేం కాదు. అంతేకాకుండా లీగ్ మొత్తం ముంబైలోని జరుగుతుండటం టీమ్కు అడ్వాంటేజ్గా మారనుంది. ఇక కెప్టెన్గా రోహిత్ శర్మ, కోచ్గా మహేళ జయవర్థనే ఉండటం ఆ జట్టుకు అదనపు బలం.