
ముంబై: జోస్ బట్లర్ అద్భుత బ్యాటింగ్ తమ ఓటమిని శాసించిందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. రాజస్థాన్ రాయల్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విపలమైన ముంబై 23 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హిట్ మ్యాన్ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. జోస్ బట్లర్ అసాధారణ బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. తమ జట్టులో తిలక్ వర్మ, ఇషాన్ కిషన్లు అద్భుతంగా ఆడారని చెప్పిన హిట్ మ్యాన్.. ఈ ఇద్దరిలో ఒక్కరు ఇన్నింగ్స్ ముగించినా ఫలితం మరోలా ఉండేదన్నాడు. సూర్యకుమార్ యాదవ్ తమ కీలక ప్లేయరని, అతని రీఎంట్రీతోనే తమ టీమ్ బలంగా మారుతుందని చెప్పాడు.
'రాజస్థాన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. 194 పరుగుల భారీ లక్ష్యాన్ని మా ముందు ఉంచింది. జోస్ బట్లర్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. అతన్ని ఔట్ చేయడానికి మేం అన్ని రకాలుగా ప్రయత్నించాం. కానీ అతను మాకు ఆ అవకాశం ఇవ్వకుండా అద్భుతంగా ఆడాడు. అయితే ఈ వికెట్పై 194 పరుగుల లక్ష్యం చేధించేదే. మరీ ముఖ్యంగా మా విజయానికి 7 ఓవర్లలో 70 పరుగులు అవసరమైన పరిస్థితిల్లో మేం చేతులెత్తేసాం. టోర్నీ ఆరంభంలో ఇలాంటివి జరగడం మన మంచికే. ఈ తప్పిదాల నుంచి గుణ పాఠం నేర్చుకొని మరింత మెరుగవచ్చు.
ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా, టైమిల్ మిల్స్ అద్భుతంగా బౌలింగ్ చేయడం మాకు సానుకూలంశం. తిలక్ వర్మ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ సైతం తన ఫామ్ను కొనసాగించాడు. ఈ ఇద్దరిలో ఒక్కరు చివరకు ఆడినా ఫలితం మరోలా ఉండేది. ప్రత్యర్థి టీమ్ బలంగా ఉంది. మేం కూడామా బ్యాటర్లు అలా ఆడేలా తయారు చేస్తాం. బట్లర్ లాంటి క్వాలిటీ బ్యాటర్ చెలరేగినప్పుడు ఇలాంటి ఫలితం ఎదురవ్వడం సహజమే. సూర్యకుమార్ యాదవ్ మా కీలక ప్లేయర్. అతను ఫిట్ అయితే నేరుగా జట్టుతో కలుస్తాడు. చేతి వేలి గాయాలు చాలా కష్టమైనవి. అందుకే మేం అతనికి తగిన సమయం ఇవ్వాలనుకుంటున్నాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు మాత్రమే చేసింది. ఇషాన్ కిషన్(43 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 54), తిలక్ వర్మ(33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. చివర్లో పొలార్డ్(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 22) మెరుపులు మెరిపించినా.. చేధించాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండటంతో ముంబైకి ఓటమి తప్పలేదు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్, సైనీ రెండేసి వికెట్లు తీయగా.. బౌల్ట్, ప్రసిధ్, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.