
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో వరుస పరాజయాలతో తీవ్ర చికాకు గురైన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలను నుంచి తప్పుకొని వాటిని మహేంద్ర సింగ్ ధోనీకే అప్పజెప్పాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ట్విటర్ వేదికగా ఓ ప్రకటనలో పేర్కొంది. దాంతో చెన్నై జట్టును మళ్లీ ధోనీనే నడిపించనున్నాడు.
'వ్యక్తిగత ప్రదర్శనపై మరింత ఫోకస్ పెట్టేందుకు రవీంద్ర జడేజా సారథ్య బాధ్యతలను వదులుకున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాలని మహేంద్ర సింగ్ ధోనీని కోరగా.. టీమ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అతను అంగీకరించాడు.'అని చెన్నై సూపర్ కింగ్స్ తమ ప్రకటనలో పేర్కొంది.
ఈ సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన సీఎస్కే రెండు మాత్రమే గెలిచి.. ఆరు మ్యాచ్ల్లో ఓడి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న సీఎస్కే ప్లే ఆఫ్స్ చేరాలంటే టోర్నీలో మిగిలిన 6 మ్యాచ్లు గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.ధోనీ నాయకత్వంలో సీఎస్కే నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా సీజన్ ఆరంభానికి ముందే ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోవడంతో జడేజాను కెప్టెన్గా నియమించారు.
కానీ కెప్టెన్సీ భారాన్ని జడేజా మోయలేకపోయాడు. కెప్టెన్గా పెద్దగా అనుభవం లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైన అతను వ్యక్తిగతంగా కూడా దారుణంగా విఫలమయ్యాడు. లీగ్కు ముందు సూపర్ ఫామ్లో ఉన్న అతను.. కెప్టెన్సీ కారణంగా ఒక్క విన్నింగ్ పెర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే వ్యక్తిగత ప్రదర్శనను మెరుగుపరుచుకునేందుకు సారథ్య బాధ్యతలను వదిలేసాడు. మరోవైపు ప్లేయర్గా బరిలోకి దిగిన ధోనీ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో దుమ్మురేపుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ బాదాడు.