
వార్నర్ కోసం..
డిసెంబర్ 25లోపు కొత్త ప్రాంచైజీలు ఈ జాబితాను బీసీసీఐకి సమర్పించాల్సి ఉంది. ఆ తర్వాత మిగిలిన ఆటగాళ్లతో మెగావేలం జరగనుంది. ఈ క్రమంలో ఫ్రాంచైజీలన్నీ మెగా వేలానికి సంబంధించి తమ ప్రణాళికలను రచిస్తున్నాయి. స్టార్ ఆటగాళ్లను కొత్త జట్లు ఎత్తుకుపోకుండా పావులు కదుపుతున్నాయి. భారీ ఆఫర్లిస్తూ తమ జట్టు తరఫున ఆడేలా ఒప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ).. సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్కు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. రిటెన్షన్ ప్రక్రియలో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్వెల్, మహమ్మద్ సిరాజ్లను రిటైన్ చేసుకుంది.

మ్యాక్సీ సాయంతో..
అయితే ఆస్ట్రేలియాకే చెందిన మ్యాక్స్వెల్తో డేవిడ్ వార్నర్ కోసం మార్క్ స్కెచ్ వేసింది. గత సీజన్లో మ్యాక్సీ కోసం ఆడమ్ జంపాను ఎలా వాడుకుందో.. ఇప్పుడు మ్యాక్సీతో వార్నర్ను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. డేవిడ్ వార్నర్ను జట్టులోకి తీసుకుంటే టాపార్డర్ బలమవడంతో పాటు కెప్టెన్సీ ఆప్షన్ కూడా లభిస్తుందని మైక్ హెస్సెన్ నేతృత్వంలోని ఆర్సీబీ మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తోంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వార్నర్ను తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇప్పటికే మ్యాక్సీ సాయంతో తమ ఆఫర్ను వార్నర్ ముందు ఉంచారట.
దీనికి వార్నర్ కూడా అంగీకరించాడని తెలుస్తోంది.

కోహ్లీ కామెంట్తో..
ఇటీవల ఫేస్ యాప్ టెక్నాలజీ సాయంతో పుష్ప సినిమాలోని 'యే బిడ్డా.. ఇది నా అడ్డా'అనే పాటను ఇమిటేట్ చేస్తూ రూపొందించిన వీడియోను వార్నర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకోగా విరాట్ కోహ్లీ స్పందించాడు. అంతా ఒకేనా డేవిడ్ భాయ్ అంటూ విరాట్ కోహ్లీ కామెంట్ చేశాడు. దీనికి వార్నర్ మెడల కొంచెం నొప్పిగా ఉన్నాయంటూ బదులిచ్చాడు. అయితే ఎప్పుడూ ఇలా కామెంట్ చేయని విరాట్ కోహ్లీ.. డేవిడ్ వార్నర్ వీడియోకు స్పందించడంతో అభిమానులు కొత్త చర్చకు తెరలేపారు. గతంలో మ్యాక్స్వెల్ విషయంలో కూడా కోహ్లీ ఇలానే హింట్ ఇచ్చాడని గుర్తు చేశారు. ఇక డేవిడ్ వార్నర్ కోసమే యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ను రిటైన్ చేసుకోలేదని చెబుతున్నారు. ఏదీ ఏమైనా వార్నర్ జట్టులో చేరితే ఆర్సీబీ బలం ఆమాంతం పెరగనుంది.

మళ్లీ కెప్టెన్గా కోహ్లీ..
ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి స్వచ్చంధంగా తప్పుకున్న విరాట్ కోహ్లీ.. మళ్లీ సారథిగా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి వేటుకు గురవ్వడంతో కెప్టెన్గా ఉంచేందుకు కోహ్లీని ఆర్సీబీ మేనేజ్మెంట్ బుజ్జగిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి 2023 వన్డే ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న కోహ్లీ.. ఆ క్రమంలోనే తనపై నెలకొన్న పనిభారాన్ని తగ్గించుకునేందుకు ఆర్సీబీ కెప్టెన్సీతో పాటు టీమిండియా టీ20 సారథ్య బాధ్యతలను వదులుకున్నాడు. కానీ బీసీసీఐ మాత్రం వైట్ బాల్ క్రికెట్లో ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదని విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై వేటు వేసింది.
వన్డే, టీ20 కెప్టెన్సీ కోల్పోవడంతో ఇప్పుడు విరాట్ కోహ్లీకి కావాల్సినంత సమయం దొరుకుతుంది. పైగా కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని విరాట్ అవమానంగా భావిస్తున్నాడని అతని సన్నిహితులు పేర్కొంటున్నారు. కోహ్లీకి చెప్పే ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ ఎన్ని కాకమ్మ కథలు చెప్పినా.. వాటిని నమ్మే పరిస్థితిల్లో అభిమానులు లేరు. కాబట్టి విరాట్.. ఆర్సీబీ పగ్గాలు అందుకొని సత్తా చాటాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ప్రతీసారి టీమ్లో సరైన ఆటగాళ్లు లేకనే విఫలమయ్యే ఆర్సీబీ.. ఈ సారి వేలంలో మంచి ఆటగాళ్లను తీసుకొవాలని సూచిస్తున్నారు. బీసీసీఐ చెంప చెళ్లుమనేలా టైటిల్ గెలవాలని కోరుతున్నారు.


Click it and Unblock the Notifications
