నయా ఫ్రాంచైజీల పికప్ రూల్స్ ఇవే..
కొత్త జట్లలో అహ్మదాబాద్ బేస్ ఫ్రాంచైజీని సీవీసి క్యాపిటల్స్ రూ.5625 కోట్లుకు దక్కించుకోగా.. లక్నో బేస్ టీమ్ను రూ. 7090 కోట్లకు గోయెంక గ్రూప్కు చెందిన ఆర్పీఎస్జీ సొంతం చేసుకుంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగియగా.. మిగిలిన ఆటగాళ్లలో నుంచి కొత్త ఫ్రాంచైజీలు ముగ్గురేసి ఆటగాళ్లను నేరుగా ఎంచుకోవచ్చు. దానికి రూ.90 కోట్ల టీమ్ పర్స్ నుంచి రూ.33 కోట్లు ఖర్చు చేయాలి. అంతేకాకుండా తొలి ఆటగాడికి రూ.15 కోట్లు, రెండో ప్లేయర్కు రూ. 11 కోట్లు, మూడో ఆటగాడికి రూ.7 కోట్లు చెల్లించాలి. అయితే ఈ సాలరీ రూల్స్పై స్పష్టత లేదు. ముగ్గురిని తీసుకుంటే ఇలా ఉండాలన్నారు. కానీ ఒక్కరిని, ఇద్దరిని తీసుకుంటే ఏంటనేది చెప్పలేదు.
కెప్టెన్గా కేఎల్ రాహుల్..
భారీ ధరకు టీమ్ను కొనుగోలు చేసిన లక్నో ఫ్రాంచైజీ.. రిటెన్షన్ ప్రక్రియ ముగియకముందే ఆటగాళ్లపై గాలం వేసినట్లు ప్రచారం జరిగింది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ను కేఎల్ రాహుల్, సన్రైజర్స్ హైదరాబాద్ను రషీద్ ఖాన్ వదిలేలా ప్రలోభాలకు గురిచేసిందని వార్తలు వచ్చాయి. ఆయా ఫ్రాంచైజీలు లక్నోపై ఫిర్యాదు చేసినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఇక కేఎల్ రాహుల్ను రూ.20 కోట్లకు ఒప్పందం కుదుర్చుకన్నట్లు తెలుస్తోంది. లక్నో టీమ్ కెప్టెన్సీ బాధ్యతలను కూడా ఆఫర్ ఇచ్చిందని, దానికి రాహుల్ అంగీకరించాడని ప్రచారం జరుగుతుంది. ఐపీఎల్ 2021లో రూ.9 కోట్ల వేతనం అందుకున్న రాహుల్కు ఈ సారి ఏకంగా రెండున్నర రెట్ల కాంట్రాక్ట్ దక్కనుంది.
రషీద్ ఖాన్, డేవిడ్ వార్నర్..
ఇక లక్నో తమ రెండో ప్లేయర్గా రషీద్ ఖాన్ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతనితో ఒప్పందం కుదుర్చుకుందని, దాంతోనే ఈ అఫ్గాన్ స్పిన్నర్.. సన్రైజర్స్ వీడినట్లు అర్థమవుతుంది. రూ.14 కోట్లకు అతన్ని తీసుకునేందుకు సిద్దమైందని లక్నో రెండో ప్లేయర్గా అతన్ని తీసుకున్నట్లు సమాచారం. ఇక గత కొన్నేళ్లుగా సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన రషీద్ ఖాన్ కీ బౌలర్గా సత్తా చాటాడు. ఇక డేవిడ్ వార్నర్ను సైతం లక్నో తీసుకునే అవకాశం ఉంది. సన్రైజర్స్ వార్నర్ను వదులుకున్న విషయం తెలిసిందే.