IPL 2022 Mega Auction: లక్నో కెప్టెన్గా కేఎల్ రాహుల్.. నయా ఫ్రాంచైజీ ఎంచుకునేది ఆ ముగ్గురినే!

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ముందు కీలక ఘట్టమైన ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. గత మంగళవారమే పాత ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించాయి. కొన్ని అనూహ్యాలు... మరికొన్ని ఆశ్చర్యకర నిర్ణయాలు... మొత్తంగా చూస్తే అంచనాలకు అనుగుణంగానే ఈ రిటెన్షన్ ప్రక్రియ సాగింది. సుదీర్ఘ కాలంగా తమ విజయాల్లో భాగంగా ఉన్న కొందరు ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు నమ్మకం పెట్టుకోగా, మరికొందరిని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొనసాగించేందుకు సిద్ధపడ్డాయి. సన్రైజర్స్ హైదరాబాద్తో డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్ బంధం ముగియగా, ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను వదిలేసింది.
డుప్లెసిస్కంటే మొయిన్ అలీ వైపే చెన్నై సూపర్ కింగ్స్ మొగ్గు చూపగా, పొలార్డ్లో ఇంకా పవర్ మిగిలి ఉందని ముంబై నమ్మింది. కోల్కతా నైట్రైడర్స్ కూడా గిల్లాంటి కుర్రాడిని కాదని రసెల్లాంటి వెటరన్కే ప్రాధాన్యత ఇచ్చింది. పంజాబ్ కింగ్స్ను కేఎల్ రాహుల్ విడిచిపెట్టగా.. చాహల్ను ఆర్సీబీ వదిలేసింది. ఇక రిటెన్షన్ ప్రక్రియ ముగియడంతో కొత్తగా వచ్చిన రెండు జట్లు ఎంచుకునే ఆటగాళ్లు ఎవరు? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

నయా ఫ్రాంచైజీల పికప్ రూల్స్ ఇవే..
కొత్త జట్లలో అహ్మదాబాద్ బేస్ ఫ్రాంచైజీని సీవీసి క్యాపిటల్స్ రూ.5625 కోట్లుకు దక్కించుకోగా.. లక్నో బేస్ టీమ్ను రూ. 7090 కోట్లకు గోయెంక గ్రూప్కు చెందిన ఆర్పీఎస్జీ సొంతం చేసుకుంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగియగా.. మిగిలిన ఆటగాళ్లలో నుంచి కొత్త ఫ్రాంచైజీలు ముగ్గురేసి ఆటగాళ్లను నేరుగా ఎంచుకోవచ్చు. దానికి రూ.90 కోట్ల టీమ్ పర్స్ నుంచి రూ.33 కోట్లు ఖర్చు చేయాలి. అంతేకాకుండా తొలి ఆటగాడికి రూ.15 కోట్లు, రెండో ప్లేయర్కు రూ. 11 కోట్లు, మూడో ఆటగాడికి రూ.7 కోట్లు చెల్లించాలి. అయితే ఈ సాలరీ రూల్స్పై స్పష్టత లేదు. ముగ్గురిని తీసుకుంటే ఇలా ఉండాలన్నారు. కానీ ఒక్కరిని, ఇద్దరిని తీసుకుంటే ఏంటనేది చెప్పలేదు.

కెప్టెన్గా కేఎల్ రాహుల్..
భారీ ధరకు టీమ్ను కొనుగోలు చేసిన లక్నో ఫ్రాంచైజీ.. రిటెన్షన్ ప్రక్రియ ముగియకముందే ఆటగాళ్లపై గాలం వేసినట్లు ప్రచారం జరిగింది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ను కేఎల్ రాహుల్, సన్రైజర్స్ హైదరాబాద్ను రషీద్ ఖాన్ వదిలేలా ప్రలోభాలకు గురిచేసిందని వార్తలు వచ్చాయి. ఆయా ఫ్రాంచైజీలు లక్నోపై ఫిర్యాదు చేసినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఇక కేఎల్ రాహుల్ను రూ.20 కోట్లకు ఒప్పందం కుదుర్చుకన్నట్లు తెలుస్తోంది. లక్నో టీమ్ కెప్టెన్సీ బాధ్యతలను కూడా ఆఫర్ ఇచ్చిందని, దానికి రాహుల్ అంగీకరించాడని ప్రచారం జరుగుతుంది. ఐపీఎల్ 2021లో రూ.9 కోట్ల వేతనం అందుకున్న రాహుల్కు ఈ సారి ఏకంగా రెండున్నర రెట్ల కాంట్రాక్ట్ దక్కనుంది.

రషీద్ ఖాన్, డేవిడ్ వార్నర్..
ఇక లక్నో తమ రెండో ప్లేయర్గా రషీద్ ఖాన్ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతనితో ఒప్పందం కుదుర్చుకుందని, దాంతోనే ఈ అఫ్గాన్ స్పిన్నర్.. సన్రైజర్స్ వీడినట్లు అర్థమవుతుంది. రూ.14 కోట్లకు అతన్ని తీసుకునేందుకు సిద్దమైందని లక్నో రెండో ప్లేయర్గా అతన్ని తీసుకున్నట్లు సమాచారం. ఇక గత కొన్నేళ్లుగా సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన రషీద్ ఖాన్ కీ బౌలర్గా సత్తా చాటాడు. ఇక డేవిడ్ వార్నర్ను సైతం లక్నో తీసుకునే అవకాశం ఉంది. సన్రైజర్స్ వార్నర్ను వదులుకున్న విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications