
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న రెండు జట్లకు పచ్చ జెండా ఊపిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. మెగా వేలం ఏర్పాట్లపై దృష్టిసారించింది. ఇప్పటికే బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12,13 తేదీల్లో మెగా ఆక్షన్ నిర్వహిస్తామని చెప్పిన బీసీసీఐ.. ఆ దిశగా కార్యచరణను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే మెగా వేలానికి ముందు పికప్ ఆప్షన్ కింద కొత్త జట్లు ఎంచుకునే ఆటగాళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఆయా ఫ్రాంచైజీలకు సూచించింది.
జనవరి 22లోపు రెండు జట్లు తమ జాబితాను అందించాలని డెడ్లైన్ విధించింది. వాస్తవానికి డిసెంబర్ 25నే ఈ ప్రక్రియ పూర్తవ్వాల్సింది. కానీ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని దక్కించుకున్న సీవీసీ క్యాపిటల్స్ పలు బెట్టింగ్ సంస్థలతో కాంట్రాక్టులు కుదుర్చుకుందన్న ఆరోపణలతో ఆ ఫ్రాంచైజీ క్లియరెన్స్పై సందేహాలు రేకెత్తాయి. అయితే ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని తెలుసుకున్న బీసీసీఐ.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక పికప్ ఆప్షన్ నిబంధనల ప్రకారం వేలానికి అందుబాటులో ఉన్న ఆటగాళ్లలో నుంచి కొత్త జట్లు ముగ్గేరిసి ఆటగాళ్లను తీసుకోవచ్చు. అయితే వారికి చెల్లించే వేతనం రూ.33 కోట్లకు చెల్లించరాదు. తొలి ప్లేయర్కు రూ.15 కోట్లు, రెండో ప్లేయర్ రూ.11 కోట్లు, మూడో ప్లేయర్ రూ. 7 కోట్లు మాత్రమే ఇవ్వాలి. అన్క్యాప్డ్ ప్లేయర్కు మాత్రం రూ.4 కోట్లు ఖర్చుపెట్టాలి. ఇద్దరి తీసుకుంటే రూ. 24 కోట్లు( మొదటి ప్లేయర్కు రూ. 14 కోట్లు), ఒక్క ప్లేయర్ను తీసుకుంటే రూ. 14 కోట్లే చెల్లించాలి. ఇక ఈ సీజన్కు ఫ్రాంచైజీల పర్స్మనీ రూ.90 కోట్లకు పెరిగిన విషయం తెలిసిందే.
ఇప్పటికే రెండు జట్లు ముగ్గురేసి ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. లక్నో జట్టు.. కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్, రవి బిష్ణోయ్లను తీసుకున్నట్లు తెలుస్తోంది. కేఎల్ రాహుల్ కెప్టెన్గా జట్టును నడిపించనున్నాడు. ఇక ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడిన విషయం తెలిసిందే. ఇక పంజాబ్ కింగ్స్ తరఫున రవి బిష్ణోయ్ అద్భుత ప్రదర్శన కనబర్చగా.. రాహుల్ సూచలనతోనే అతని ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. వేలాని దృష్టిలో పెట్టుకొని మరీ ఈ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. ఇక అహ్మదాబాద్ హార్దిక్ పాండ్యాతో పాటు రషీద్ ఖాన్, ఇషాన్ కిషన్లను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.