
రూ. 7090 కోట్ల భారీ ధరకు
ఇప్పటికే కొత్త జట్ల ప్రక్రియను ముగించిన బీసీసీఐ మెగా వేలం నిర్వహణపై దృష్టి సారించింది. డిసెంబర్ చివరి వారంలో మెగా ఆక్షన్ నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తోంది. కొత్తగా వచ్చిన జట్లలో అహ్మదాబాద్ బేస్ ఫ్రాంచైజీని సీవీసి క్యాపిటల్స్ రూ.5625 కోట్లకు దక్కించుకోగా.. లక్నో బేస్ టీమ్ను రూ. 7090 కోట్లకు ఆర్పీఎస్జీ సొంతం చేసుకుంది.
దాంతో ఐపీఎల్ 2022 సీజన్ పది జట్లతో ప్రేక్షకులను అలరించనుంది. ఇక మెగావేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీని సిద్దం చేసిన బీసీసీఐ అధికారికంగా ప్రకటించకపోయినా.. ఫ్రాంచైజీలకు సమాచారమిచ్చింది. నవంబర్ 30లోపు తమ రిటెన్షన్ జాబితాను అందజేయాలని ఫ్రాంచైజీలకు సూచించింది.

కొత్త జట్లకు ముగ్గురే..
రిటెన్షన్ జాబితాలో లేని ఆటగాళ్ల నుంచి ముగ్గురిని ఎంచుకునే అవకాశం కొత్త జట్లకు కల్పించింది. ఈ ప్రక్రియను డిసెంబర్ తొలి వారంలో పూర్తి చేయాలని చెప్పింది. అయితే పాత ఫ్రాంచైజీలో కొనసాగాలా? లేక వేలంలో వెళ్లాలా? అనేది ఆటగాళ్లకే వదిలేసింది. దాంతో కొత్త జట్లు టీమిండియా స్టార్ ఆటగాళ్లతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలోనే గోయెంకా గ్రూప్ రాహుల్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
బీసీసీఐ రూపొందించిన రిటెన్షన్ రూల్స్ ప్రకారం ఓ ఫ్రాంచైజీ గరిష్టంగా నలుగురి ఆటగాళ్లను మాత్రమే అంటిపెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో ఇద్దరేసి భారత ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. లేదా ముగ్గురు భారత్, ఒక్కరు విదేశీ ప్లేయర్ను తీసుకోవచ్చు. జీత భత్యాల్లో కూడా రూల్స్ పాటించాలి. ఒక్కో జట్టు తమ రిటైన్ ఆటగాళ్ల కోసం గరిష్టంగా రూ.42 కోట్లు, కనిష్టంగా రూ.14 కోట్లు ఖర్చుపెట్టుకోవచ్చు.

నలుగురైతే..
నలుగురిని రిటైన్ చేసుకుంటే తొలి ఆటగాడికి రూ.16 కోట్లు, రెండో ప్లేయర్కు రూ. 12 కోట్లు, మూడో ప్లేయర్కు రూ. 8 కోట్లు, నాలుగో ప్లేయర్కు రూ.6 కోట్లు చెల్లించాలి. ఈ లెక్కన ఫ్రాంచైజీలు రూ.90 కోట్ల తమ పర్స్ వాల్యూ నుంచి రూ.42 కోట్లు కోల్పోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలతో ఫ్రాంచైజీల కోర్ టీమ్ చెల్లాచెదురు కానుంది. అంతేకాకుండా ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఎవరిని తీసుకోవాలనేది కూడా ఫ్రాంచైజీలకు సవాల్గా మారింది. ఈ క్రమంలోనే బలమైన లైనప్ ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లు ఎవరా? అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సూర్యకుమార్ యాదవ్ సైతం..
ఇక సూర్యకుమార్ యాదవ్ను సైతం గోయెంకా గ్రూప్ సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే అతను ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ముంబై ఇండియన్స్ రిటెన్షన్ జాబితాలో సూర్యకు చోటు ఉండటం కష్టంగా మారిన నేపథ్యంలో కొత్త జట్లు అతని కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. కెప్టెన్గా అవకాశమిస్తామని ఆశ చూపుతున్నాయి. సూర్యకుమార్ యాదవ్ మాత్రం.. ముంబై ఇండియన్స్ రిటెన్షన్ జాబితాలో చోటు దక్కుతుందనే ఆశతో ఉన్నాడు. ముంబై మేనేజ్మెంట్ నుంచి స్పష్టత వచ్చిన తర్వాత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications












