కేన్ మామ ఒక్కడే..
సన్రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా తమ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక్కడినే రిటైన్ చేసుకుంది. మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్తో ఉన్న బేధాభిప్రాయాల నేపథ్యంలో అతన్ని పట్టించుకోని ఆరెంజ్ ఆర్మీ.. రషీద్ ఖాన్ను అంటిపెట్టుకోవాలని భావించినప్పటికీ అతను భారీగా డబ్బు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో అతన్ని కూడా వదిలేసి కేన్ మామతో సరిపెట్టుకుంది.
ముంబై ఇండియన్స్ సైతం రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ఇద్దరినే రిటైన్ చేసుకుంది. కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ల పేర్లు వినిపించినా ఆ ఫ్రాంచైజీ వేలానికే మొగ్గు చూపింది. ఇక కోల్కతా నైట్రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే నలుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటున్నాయి.
స్టార్ ఆటగాళ్లకు షాక్..
కోల్కతా సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తీతో పాటు వెంకటేశ్ అయ్యర్ను తీసుకుంది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్లను ఆ జట్టు వదిలేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్వెల్ను మాత్రమే తీసుకుంది. దేవదత్ పడిక్కల్ పేరు వినిపించినా ఫ్రాంచైజీ వేలానికే మొగ్గు చూపింది. ఢిల్లీ క్యాపిటల్స్ రిషభ్ పంత్, పృథ్వీ షా, అక్షర్ పటేల్, అన్రిచ్ నోర్జ్లను అంటిపెట్టుకుంది.
స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్తో పాటు మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కగిసో రబడాలను ఆ జట్టు వదులుకుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ సంజూ శాంసన్ను ఒక్కడినే రిటైన్ చేసుకోవడం గమనార్హం. స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్, బ్యాట్స్మన్ జోస్ బట్లర్ను వదులుకోవడం విశేషం. ఇక కేఎల్ రాహుల్ జట్టు వీడటంతో తీవ్ర అసంతృప్తికి గురైన పంజాబ్ కింగ్స్ ఒక్క ఆటగాడిని కూడా రిటైన్ చేసుకోలేదు.
ఫ్రాంచైజీల రిటెన్షన్ పూర్తి జాబితా..
చెన్నై సూపర్ కింగ్స్: రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ
కోల్కతా నైట్రైడర్స్: సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తీ, వెంకటేశ్ అయ్యర్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్వెల్
ఢిల్లీ క్యాపిటల్స్: రిషభ్ పంత్, పృథ్వీ షా, అక్షర్ పటేల్, అన్రిచ్ నోర్జ్
రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్
పంజాబ్ కింగ్స్: ఒక్కరిని కూడా రిటైన్ చేసుకోలేదు
రిటెన్షన్ రూల్స్ ఇవే..
బీసీసీఐ రూపొందించిన రిటెన్షన్ రూల్స్ ప్రకారం పాత ఫ్రాంచైజీలు గరిష్టంగా నలుగురి ఆటగాళ్లను మాత్రమే అంటిపెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో ఇద్దరేసి భారత ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. లేదా ముగ్గురు భారత్, ఒక్కరు విదేశీ ప్లేయర్ను తీసుకోవచ్చు. అన్ క్యాప్డ్ ప్లేయర్స్ ఇద్దరిని మించకూడదు. జీత భత్యాల్లో కూడా రూల్స్ పాటించాలి.
నలుగురిని రిటైన్ చేసుకుంటే తొలి ఆటగాడికి రూ.16 కోట్లు, రెండో ప్లేయర్కు రూ. 12 కోట్లు, మూడో ప్లేయర్కు రూ. 8 కోట్లు, నాలుగో ప్లేయర్కు రూ.6 కోట్లు చెల్లించాలి. ఈ లెక్కన ఫ్రాంచైజీలు రూ.90 కోట్ల తమ పర్స్ వాల్యూ నుంచి రూ.42 కోట్లు కోల్పోవాల్సి ఉంటుంది. ఈ రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత మిగిలిన ఆటగాళ్ల నుంచి కొత్త జట్లు 'పిక్ అప్'ఆప్షన్ కింద ముగ్గురిని ఎంచుకోవచ్చు.