న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 మెగా వేలానికి సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్, సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్ జానీ బెయిర్ స్టో.. అప్కమింగ్ ఐపీఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కు ఆడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ ఫ్రాంచైజీతో ఈ ఇంగ్లండ్ ఓపెనర్ లోపకాయిరీ ఒప్పందం చేసుకున్నాడని ఈవ్నింగ్ స్టాండార్డ్ అనే వెబ్సైట్ పేర్కొంది.
గత సీజన్ వరకు సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడిన జానీ బెయిర్ స్టో.. ఆ జట్టు రిటెన్షన్కు అంగీకరించలేదు. వేలంలోకి వెళ్లేందుకే ఇష్టపడ్డాడు. దాంతో సన్రైజర్స్ హైదరాబాద్ అతన్ని వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఆర్సీబీతో చేసుకున్న ఒప్పందం నేపథ్యంలోనే జానీ బెయిర్ స్టో.. సన్రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్కు ఒప్పుకోలేదని తెలుస్తోంది. అయితే లీగ్లో వచ్చిన నయా ఫ్రాంచైజీలు లక్నో, అహ్మాదాబాద్ టీమ్స్.. ఈ ఇంగ్లండ్ ప్లేయర్ను తీసుకోవడం ఖాయమని ప్రచారం జరిగింది.
లక్నో అతన్ని ఎంచుకుందని, కెప్టెన్ కేఎల్ రాహుల్తో కలిసి అతను ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని కథనాలు కూడా వచ్చాయి. అయితే కొత్త జట్ల ఆఫర్కు కూడా బెయిర్ స్టో తలొగ్గలేదని తెలుస్తోంది. సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా ఆర్సీబీ జట్టులోకి వెళ్తున్నాడని కథనాలు వస్తున్నాయి. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్వెల్, మహమ్మద్ సిరాజ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. డేవిడ్ వార్నర్, బెయిర్ స్టోలను తీసుకోవడం కోసమే ముగ్గురిని రిటైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు ఆర్సీబీ జట్టులోకి వెళ్తే ఓపెనర్లుగా ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది.
ఇక మెగా వేలానికి ముందు కీలక ఘట్టమైన రిటెన్షన్ ప్రక్రియ ముగియగా.. కొత్త జట్లు ముగ్గురేసి ఆటగాళ్లను ఎంచుకోవాల్సింది. ఈ డ్రాఫ్ట్లను సమర్పించేందుకు బీసీసీఐ జనవరి 22న డెడ్లైన్ విధించింది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా మెగా వేలాన్ని నిర్వహిస్తామని ప్రకటించింది. ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే భారత్ వేదికగానే మార్చి చివరి వారం నుంచి అప్కమింగ్ ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. కానీ ప్రస్తుతం దేశంలో మూడో వేవ్ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బోర్డు అన్నీ నిశితంగా పరిశీలిస్తుంది. శ్రీలంక, సౌతాఫ్రికా వేదికగా నిర్వహించేందుకు ప్లాన్ బీ రెడీ చేసుకుంది.