
నా రెండో ఇల్లు..
'హైదరాబాద్ నా రెండో ఇల్లులాంటిది. ఇక్కడి అభిమానులు నన్ను ఎంతగానో ఆరాధించారు. ఓ కుటుంబ సభ్యుడిలా ట్రీట్ చేశారు. హైదరాబాద్కు వచ్చిన ప్రతీసారి ఎంతో అప్యాయంగా మాట్లాడారు. నా పిల్లల పట్ల అంతే అభిమానాన్ని చూపెట్టారు. ఇవన్నీ నా జీవితంలోనే మర్చిపోలేని మధుర క్షణాలు. అంత ప్రేమ చూపించిన అభిమానులకోసమైనా వచ్చే ఏడాది సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడాలనిపిస్తోంది. కానీ ఫ్రాంచైజీ, మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయంపైనే ఇది ఆధారపడి ఉంది. ప్రస్తుతానికైతే నా ఐపీఎల్ భవితవ్యం ఏంటనేది కాలమే నిర్ణయిస్తుంది. కొత్తగా రెండు జట్లు రానున్న నేపథ్యంలో మెగా వేలం జరగనుంది. కాబట్టి ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం.

అందుకే అలా పోస్ట్ పెట్టా..
ఈ క్రమంలోనే నాకు కెప్టెన్గా అవకాశామిచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్కు ధన్యవాదాలు చెప్పా. ఇన్స్టా వేదికగా జట్టుతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నా. ఇక సన్రైజర్స్ హైదరబాద్ తరఫున టైటిల్ గెలిచా. గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడా. జట్టు క్లిష్ట స్థితిలో ఉన్నప్పుడు బ్యాట్తో రాణించా. నాకిచ్చిన ప్రతీ బాధ్యతను నెరవేర్చా. లోయరార్డర్లో ఆడాల్సి వచ్చినా బరిలోకి దిగా. హైదరాబాద్ తరఫున సుమారు 100 మ్యాచ్లు ఆడా. నా శక్తి సామర్థ్యాల మేరకు రాణించా. వచ్చే ఏడాది మెగా వేలం జరుగునున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చెప్పలేం. ఎందుకంటే అది మన చేతుల్లో లేదు. అయితే కొన్నిసార్లు మన చుట్టు జరుగుతున్న పరిస్థితులను బట్టి మనల్ని రిటైన్ చేసుకుంటారా? లేదా? అనే విషయం తెలిసిపోతుంది. నా వరకు ఫ్రాంచైజీకి థ్యాంక్స్ చెప్పడానికి ఇదే సరైన సమయమనిపించింది.

పరుగులు చేసే సత్తా ఉంది..
వచ్చే ఏడాది కూడా సన్రైజర్స్ హైదరాబాద్ తరఫునే బరిలోకి దిగాలనుంది. ఐపీఎల్ 2022లో భాగమవ్వాలనుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో మొదలు పెట్టి.. సన్రైజర్స్ హైదరాబాద్తో కొనసాగగా.. వచ్చే ఏడాది వచ్చే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. నాలో ఇంకా పరుగులు చేసే సత్తా ఉంది.'అని వార్నర్ చెప్పుకొచ్చాడు. ఇక 2014లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చిన వార్నర్.. ఆ ఏడాది ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచాడు. 2015లో జట్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించి 2016లో టైటిల్ అందించాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 150 మ్యాచ్లు ఆడిన వార్నర్.. నాలుగు సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలతో 5449 రన్స్ చేశాడు. 2014 నుంచి 2020 వరకు వరుసగా ఏడు సీజన్ల పాటు 500 ప్లస్ పరుగులు చేశాడు.

ఘోర అవమానం..
ఐపీఎల్ 2021 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్లో సన్రైజర్స్ వరుస పరాజయాలను చవిచూసింది. దాంతో టీమ్ వైఫల్యాలకు బాద్యుణ్ని చేస్తూ.. డేవిడ్ వార్నర్పై టీమ్మేనేజ్మెంట్ వేటు వేసింది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి కేన్ విలియమ్సన్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అంతేకాకుండా తుది జట్టులో నుంచి కూడా తప్పించింది. ఆ తర్వాత కేన్ మామ సారథ్యంలో ఒకే ఒక మ్యాచ్ జరగ్గా కరోనాతో లీగ్ అర్ధంతరంగా వాయిదా పడింది. ఇక యూఏఈ వేదికగా ప్రారంభమైన సెకండాఫ్ లీగ్లో వార్నర్కు మళ్లీ తుది జట్టులో అవకాశం దక్కింది. జానీ బెయిర్ స్టో చివరి క్షణంలో తప్పుకోవడంతో వార్నర్ సాహాతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలమవడంతో మళ్లీ అతనిపై వేటు పడింది.


Click it and Unblock the Notifications
