
ముంబై: మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ 2022 సీజన్కు తెరలేవనుండగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి గట్టి షాక్ తగిలింది. మ్యాచ్ల నిర్వహణ అనుమతులపై మహారాష్ట్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో 25 శాతం ప్రేక్షకులతో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించుకోవచ్చని మహరాష్ట్రలోని శివసేన ప్రభుత్వం ముందుగా అనుమతిచ్చింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ అనుమతిని రద్దు చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటం, ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు తీవ్రంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చైనాలో కేసులు పెరిగి లాక్డౌన్ విధించిన పరిస్థితులు ఉండటంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని మహరాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ప్రేక్షకుల్లేకుండా ఈ సీజన్ కూడా జరిగే అవకాశం ఉంది.
మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే ఏఎన్ఐతో మాట్లాడుతూ.. అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు లేఖ వచ్చిందన్నాడు. యూరోపియన్ దేశాలు, దక్షిణ కొరియా, చైనాలో కోవిడ్-19 కేసులు పెరిగాయని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండి, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిందని తెలిపాడు. ఇక ప్రేక్షకుల అనుమతిని రద్దు చేస్తే.. ఫ్రాంచైజీలతో పాటు బీసీసీఐకి గేట్ రెవెన్యూ లేక నష్టం వాటిల్లనుంది.
ఇక కరోనా వైరస్ నేపథ్యంలోనే బీసీసీఐ కూడా ముంబై వేదికగానే లీగ్ నిర్వహించాలని షెడ్యూల్ రూపొందింది. వాఖండే మైదానంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న డీవై పాటిల్, బ్రౌబౌర్న్ స్టేడియం, పుణే స్టేడియంలోనే లీగ్ మ్యాచ్లన్నీ నిర్వహించనుంది. ఫైనల్తో పాటు ప్లే ఆఫ్స్ మ్యాచ్లకు అహ్మదాబాద్ వేదికను ఖరారు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో పాటు రన్నరప్ కోల్కతా నైట్రైడర్స్ మధ్య ఈ నెల 26న జరిగే తొలి మ్యాచ్తో ఐపీఎల్ 2022 సీజన్ మొదలవ్వనుంది. ఇప్పటికే ఆయా జట్లన్నీ ముంబై చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టాయి.