
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ దుమ్మురేపుతున్నాడు. ఇప్పటికే ఈ సీజన్లో ఓ సెంచరీ నమోదు చేసిన రాహుల్.. తాజాగా మరో శతకాన్ని అందుకున్నాడు. ఈ రెండు సెంచరీలు కూడా ముంబై ఇండియన్స్పైనే సాధించడం విశేషం అయితే అప్పుడు ఇప్పుడూ 103 పరుగులతోనే అజేయంగా నిలవడం మరో విశేషం. ఏప్రిల్ 16న ముంబై ఇండియన్స్తో జరిగిన తొలి మ్యాచ్లో శతకం బాదిన రాహుల్.. తాజాగా వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లోనూ శతక్కొట్టాడు.
తద్వారా అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ సీజన్లో రాహుల్కు ఇది రెండో సెంచరీ కాగా.. ఓవరాల్గా నాలుగోది. తద్వారా టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన భారత బ్యాటర్గా రోహిత్ శర్మతో రాహుల్ సమంగా నిలిచాడు. రోహిత్ శర్మ 6 సెంచరీలు బాదగా.. అంతర్జాతీయ క్రికెట్లో రెండు, నాలుగు ఐపీఎల్ సెంచరీలతో రాహుల్ అతని రికార్డును సమం చేశాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ రికార్డును అతను అధిగమించాడు. ఐపీఎల్లో కోహ్లీ ఐదు సెంచరీలు బాదిన విషయం తెలిసిందే. టీ20 క్రికెట్లో 6 సెంచరీలతో రోహిత్, కేఎల్ రాహుల్ టాప్లో ఉండగా.. కోహ్లీ ఐదు, సురేశ్ రైనా నాలుగు శకతాలతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఐపీఎల్లో వేగంగా నాలుగు శతకాలు బాదిన రెండో బ్యాటర్గా రాహుల్ గుర్తింపు పొందాడు. 93 ఇన్నింగ్స్ల్లో రాహుల్ ఈ ఘనతను అందుకోగా.. జోస్ బట్లర్ 71 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. ఓవరాల్గా ఈ ఘనతను అందుకున్న 6వ బ్యాటర్గా రాహుల్ రికార్డు బుక్లోకి ఎక్కాడు. 6 సెంచరీలతో క్రిస్ గేల్ టాప్లో ఉండగా.. విరాట్ కోహ్లీ(5), జోస్ బట్లర్(4), షేన్ వాట్సన్(4), డేవిడ్ వార్నర్(4)లతో రాహుల్ సమంగా నిలిచాడు.
కేఎల్ రాహుల్(62 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లతో 103 నాటౌట్) సెంచరీతో చెలరేగడంతో ముంబై ఇండియన్స్ ముందు లక్నో సూపర్ జెయింట్స్ 168 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రాహుల్ మినహా ఇతర బ్యాటర్లు రాణించకపోవడంతో లక్నో 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు మాత్రమే చేసింది. రాహుల్ ఒక్కడే 103 పరుగులు చేయగా.. మిగతా ఐదు బ్యాటర్లు 57 రన్స్ మాత్రమే చేశారు. 8 పరుగులు ఎక్స్ట్రాల రూపంలోనే వచ్చాయి. ముంబై బౌలర్లలో రిలే మెరిడిత్, కీరన్ పొలార్డ్ రెండు వికెట్లు తీయగా.. డానియల్ సామ్స్, బుమ్రా తలో వికెట్ పడగొట్టారు.