
న్యూఢిల్లీ: ఐపీఎల్లోకి కొత్తగా ఎంట్రీ ఇస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ తమ కార్యచరణను వేగవంతం చేసింది. ఇప్పటికే సపోర్ట్ స్టాఫ్ను నియమించుకోవడంతో పాటు పేరును ఖారారు చేసుకున్న ఆ జట్టు తాజాగా లోగోను కూడా ఆవిష్కరించింది. 'అత్యున్నత శిఖరాలకు ఎగరడం కోసం.. లక్నో సూపర్ జయింట్స్ రెక్కలు విప్పేందుకు సిద్ధం. అద్భుతం కోసం సిద్ధంగా ఉండండి' అంటూ అధికారిక ట్విటర్ హ్యాండిల్లో లోగోను అభిమానులుతో పంచుకుంటూ క్యాప్షన్ ఇచ్చింది.
లోగోలో భారత త్రివర్ణ పతాకంలోని మూడు రంగులతో గరుడ పక్షి రెక్కలు ఉండగా.. దానిపై నీలి రంగులో ఫ్రాంచైజీ పేరు, బ్యాట్ ఉంది. రెక్కల మధ్యలో బ్యాట్ ఉండగా దానిపై ఆరెంజ్ కలర్ సీమ్తో ఎర్రటి బంతి ఉంది. లోగోలోని గరుడ పక్షి రెక్కలు జట్టు ప్రేరేపిస్తుందని, మూడు రంగులు దేశం మొత్తం జట్టును సూచిస్తుందని ఫ్రాంచైజీ పేర్కొంది.
ఇది చూసిన ఫ్యాన్స్.. లోగో అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్ కలిసి 7,090 కోట్ల రూపాయలతో లక్నో ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ జట్టుకు మెంటార్గా భారత మాజీ స్టార్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ను నియమించారు. అంతేకాదు ఏకంగా రూ.17 కోట్లు పెట్టి స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ను ఈ జట్టు సొంతం చేసుకుంది. అతనికే జట్టు సారధ్య బాధ్యతలు అప్పగిస్తామని ప్రకటించింది. వచ్చే నెలలోనే ఐపీఎల్ మెగా వేలం జరగనున్న నేపథ్యంలో తాజాగా లక్నో జట్టు.. తమ లోగోను ఆవిష్కరించింది.