
బెంగళూరు: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ అదే చెత్త స్ట్రాటజీని కొనసాగిస్తోంది. ఎయిడెన్ మార్క్రమ్ కొనుగోలుతో రెండో రోజు మెగా వేలాన్ని మొదలుపెట్టిన సన్రైజర్స్ హైదరాబాద్.. పూర్తిగా బౌలర్లనే తీసుకుంటుంది. ఇప్పటికే రిటైన్ చేసుకున్న ఉమ్రాన్ మాలిక్తో పాటు భువనేశ్వర్ కుమార్, నటరాజన్, కార్తీక్ త్యాగీ, మార్కో జాన్సెన్లను కొనుగోలు చేసిన ఆరెంజ్ ఆర్మీ.. మళ్లీ వెస్టిండీస్ ఆల్రౌండర్ రొమారియో షెఫెర్డ్కు కోట్లు తగలేసింది.
స్టార్ బ్యాట్స్మన్ డేవాన్ కాన్వే, ఎవిన్ లూయిస్లను వదిలేసి బౌలింగ్ విభాగాన్ని నింపుతోంది. హిట్టరయిన రొమారియో షెఫెర్డ్ కోసం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్తో పోటీపడి మరీ రూ.7.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. సన్రైజర్స్ హైదరాబాద్కు ఇంకా ఓపెనర్లు దొరకలేదు. అయినా బౌలర్లు, ఆల్రౌండర్లపై టీమ్ ఇన్వెస్ట్ చేస్తోంది. షెఫర్ట్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి కనబర్చగా.. అతని రేటు రూ.5 కోట్లు ధాటింది. అయినా సన్రైజర్స్ వెనక్కి తగ్గకుండా బిడ్ వేసింది. దాంతో చెన్నై తప్పుకోగా.. రాజస్థాన్ ఎంట్రీ ఇచ్చింది. అయినా తగ్గేదేలే అంటూ కావ్య పాప బోర్డు ఎత్తడంతో విండీస్ విధ్వంసకరుడికి భారీ ధర దక్కింది. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో ఈ విండీస్ ఆల్రౌండర్ అదరగొట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్తో సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్షించాడు.
రెండో రోజు వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఎయిడెన్ మార్క్రమ్(రూ.2.60 కోట్లు), మార్కో జాన్సెన్(రూ.4 కోట్లు), రొమారియో షెఫెర్డ్(రూ.7,75 కోట్లు)లను తీసుకుంది. ఇప్పటి వరకు మొత్తం 12 మంది ప్లేయర్లను సన్రైజర్స్ తీసుకుంది. రిటైన్ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లను కలుపుకుంటే ఆరెంజ్ ఆర్మీ వద్ద ప్రస్తుతం 15 మంది ఆటగాళ్లు ఉంటారు. వేలంలో ఇప్పటివరకు సన్రైజర్స్ వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఐడెన్ మాక్రమ్, కార్తీక్ త్యాగి, నటరాజన్, మార్కో జాన్సెన్, నికోలస్ పూరన్, అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, సుచిత్, రొమారియో షెఫెర్డ్లను కొనుగోలు చేసింది.