
ముంబై: మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఉంది ముంబై ఇండియన్స్ టీమ్ పరిస్థితి. ఇప్పటికే ఆ జట్టు స్టార్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ గాయంతో బాధపడుతుండగా.. తాజాగా ఆ జాబితాలోకి ఇషాన్ కిషన్ కూడా చేరాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్లో షాన్దార్ ఇన్నింగ్స్ ఆడిన ఈ జార్ఖండ్ కుర్రాడు.. విధ్వంసకర బ్యాటింగ్తో ముంబైకి భారీ స్కోర్ అందించాడు. అయితే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతని కాలికి గాయమయింది.
ముంబై ఇన్నింగ్స్ సందర్భంగా శార్దూల్ ఠాకూర్ వేసిన 18వ ఓవర్లో ఇషాన్కు ఈ గాయమయింది. ఆ ఓవర్ ఫస్ట్ బాల్ను శార్దూల్ యార్కర్గా సంధించగా.. దాన్ని ఆడే క్రమంలో ఇషాన్ గాయపడ్డాడు. బంతి నేరుగా అతని పాదానికి తాకింది. నొప్పితో విలవిలలాడిన ఇషాన్.. పెయిన్ కిల్లర్స్ తీసుకొని బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే ఇన్నింగ్స్ అనంతరం అతన్ని ముంబై మేనేజ్మెంట్ ఆసుపత్రికి తరలించింది. ముందస్తు చర్యల్లో భాగంగా గాయం తీవ్రతను తెలుసుకునేందుకు అతని గాయానికి స్కానింగ్ తీయించనుంది. దాంతో ఇషాన్.. ఫీల్డింగ్కు రాలేదు. అతని స్థానంలో ఆర్యన్ జుయాల్ కీపింగ్ చేస్తున్నాడు.
ఇషాన్ కిషన్ గాయం తీవ్రమయితే మాత్రం ముంబైకి కష్టాలు తప్పవు. ఇప్పటికే సూర్యను దూరం చేసుకున్న ఆ జట్టు ఇషాన్ సేవలను కోల్పోతే బ్యాటింగ్ బలహీనం అవుతోంది. రూ. 15.25 కోట్ల భారీ ధరకు ఇషాన్ కిషన్ను ముంబై వేలంలో తీసుకున్న విషయం తెలిసిందే. అతనికి చెల్లించిన ధర ప్రకారం అతను ఫస్ట్ మ్యాచ్లోనే చెలరేగాడు.
ఇషాన్ కిషన్(48 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లతో 81 నాటౌట్) షాన్దార్ ఇన్నింగ్స్తో ఫస్ట్ మ్యాచ్లోనే ముంబై ఇండియన్స్ ఢిల్లీ ముందు 178 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్కు తోడు కెప్టెన్ రోహిత్ శర్మ(32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 41), తిలక్ వర్మ(15 బంతుల్లో 3 ఫోర్లతో 22) రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ.. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో ఓపెనర్ పృథ్వీ షా(33 బ్యాటింగ్), లలిత్ యాదవ్(4 బ్యాటింగ్) ఉన్నారు. కెప్టెన్ రిషభ్ పంత్(1), మన్దీప్ సింగ్(0) దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో మురుగన్ అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. మిల్స్ ఓ వికెట్ పడగొట్టాడు.