
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్ కోసం ఐర్లాండ్ పేసర్ జోష్ లిటిల్ను చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) నెట్బౌలర్గా తీసుకుంది. ఈ విషయాన్ని క్రికెట్ ఐర్లాండ్ వెల్లడించింది. తమ అధికారిక ట్విటర్ హ్యాండిల్లో జోష్ లిటిల్ సీఎస్కే నెట్బౌలర్గా ఎంపికయ్యాడని పేర్కొంది. ఈ లెఫ్టార్మ్ పేసర్కు ఈ అవకాశం మంచి అనుభవంగా మారాలని ఆకాంక్షించింది. ఇక ఐపీఎల్ 2022 సీజన్ మార్చి 26న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లీగ్ షెడ్యూల్ బీసీసీఐ విడుదల చేయగా.. ఫస్ట్ మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరగనుంది.
ఇక 22 ఏళ్ల జోష్ లిటిల్ 2016లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఐర్లాండ్ తరఫున టీ20 క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆరంభంలోనే మంచి పేస్తో బంతిని స్వింగ్ చేయగల సామర్థ్యం అతని సొంతం. అంతేకాకుండా డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేస్తూ పరుగులను కట్టడి చేయగలడు. ఈ స్పెషల్ క్వాలిటీతోనే సీఎస్కే అతన్ని నెట్బౌలర్గా తెచ్చుకుంది.
తమ బ్యాట్స్మన్కు అతని బౌలింగ్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తోంది. ఇప్పటి వరకు 31 టీ20లు ఆడిన లిటిల్.. 34 వికెట్లు తీసారు. ఎకానమీ 7.49 కావడం విశేషం. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ బరిలో ఐర్లాండ్ తరఫున ఆడనున్న లిటిల్కు ఐపీఎల్లో నెట్బౌలర్గా సేవలందించడం మంచి అవకాశమని ఆ దేశ క్రికెట్ బోర్డు భావిస్తోంది.
ఐపీఎల్ 2022 ప్రారంభానికి మరో మూడు వారాల సమయం ఉండగానే చెన్నై సూపర్ కింగ్స్ తమ సన్నాహకాలను మొదలుపెట్టింది. సూరత్లో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంపులో ధోనీ సేన కసరత్తులు చేస్తోంది. సూరత్లో పరిస్థితులు ముంబైకి దగ్గరగా ఉంటాయనే కారణంగా ప్రాక్టీస్ సెషన్స్ను అక్కడ నిర్వహించాలని సీఎస్కే యాజమాన్యం నిర్ణయించింది.
కెప్టెన్ ధోనీతో పాటు అంబటి రాయుడు, కేఎం ఆసిఫ్, సి హరి నిషాంత్, తుషార్ దేశ్పాండే తదితరులు మార్చి 2నే సూరత్లో ల్యాండైనట్లు తెలుస్తోంది. ధోనీ, జడేజా, మొయిన్ అలీ, డ్వేన్ బ్రావో, రుతురాజ్ గైక్వాడ్ వంటి స్టార్లతో ఉన్న చెన్నై పటిష్టంగా కనిపిస్తోంది. అయితే లీగ్ ఆరంభానికి ముందే ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ దీపక్ చాహర్ సేవలను కోల్పోయింది. తొడ కండారల గాయంతో దీపక్ చాహర్ లీగ్లోని సగం మ్యాచ్లకు దూరం కానున్నాడు.