
ధోనీ రూ. 6 కోట్లే..
ప్రతీ ఏడాది సమ్మర్లో సందడి చేసే ఐపీఎల్ ఈ సారి పది జట్లతో పదింతల ఆనందాన్ని పంచేందుకు మన ముందుకు వచ్చింది. మెగా లీగ్ ప్రారంభమైన వారం రోజులు కాగా.. మెగా వేలంలో భారీ ధర పలికిన ఆటగాళ్లంతా తమ డబ్బులకు న్యాయం చేస్తున్నారు. ఇప్పుడు అనామక ఆటగాళ్లు కూడా కోట్లు ఆర్జిస్తున్నారు. కానీ ఐపీఎల్ 2008లో మహేంద్ర సింగ్ ధోనీ లాంటి దిగ్గజానికి రూ. 6 కోట్లే దక్కాయి. అతని కోసం ముంబై ఇండియన్స్ తీవ్రంగా పోటీపడటంతో మహీకి ఆ మాత్రం ధర దక్కింది. అప్పుడే 2007 టీ20 ప్రపంచకప్ గెలిచి రావడంతో అతని కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.6 కోట్ల ధరకు మహీని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి జట్టుకు సారథ్యం వహించిన అతడు ఈ సీజన్ ప్రారంభానికి ముందు సారథ్య బాధ్యతలకు వీడ్కోలు పలికాడు.

విరాట్ కోహ్లీకి రూ. 12 లక్షలే..
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ. అత్యధిక అభిమానులున్న ఆటగాడు కూడా అతనే. గత సీజన్ వరకు రూ.17 కోట్లు తీసుకున్న విరాట్.. అరంగేట్ర సీజన్లో రూ. 12 లక్షలకే అమ్ముడుపోయాడు. అండర్-19 కప్పు గెలిచిన కెప్టెన్గా వేలంలో అడుగుపెట్టిన అతన్ని ఆర్సీబీ రూ.12 లక్షలకే దక్కించుకుంది. ఢిల్లీ డేర్డేవిల్స్ కూడా పోటీపడినప్పటికీ బౌలర్ కోసం విరాట్ను వదిలేసుకుంది. అప్పటి నుంచి ఆర్సీబీకే విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు. ఈ సీజన్ కోసం రెండు కోట్ల జీతం తగ్గించుకున్న విరాట్ రూ.15 కోట్లకే రిటైన్ అయ్యాడు.

రోహిత్ శర్మ రూ.3 కోట్లు..
ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ ఆ జట్టుకు ఐదుసార్లు ట్రోఫీని అందించాడు. 2008లో తొలిసారిగా జరిగిన ఐపీఎల్ వేలంలో అతను రూ.3 కోట్ల భారీ ధర పలికాడు. హైదరాబాద్కు చెందిన డెక్కన్ చార్జర్స్ అతన్ని కొనుగోలు చేసింది. దేశవాళీ క్రికెట్ మెరుగ్గా రాణిస్తుండటంతో అతని కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. పైగా స్పిన్ బౌలింగ్ చేసే సామర్థ్యం ఉండటం అతనికి ప్లస్ పాయింట్ అయింది. ఆ తర్వాత ముంబైకి మారిన రోహిత్.. 2013లో ఆ జట్టు సారథ్య బాధ్యతలను స్వీకరించాడు. అప్పటి నుంచి ఆ జట్టుతోనే కొనసాగుతున్నాడు. ప్రస్తుత సీజన్ కోసం ముంబై అతన్ని రూ. 16 కోట్లకు రిటైన్ చేసుకుంది.

రైనాకు రూ. 2.6 కోట్లు..
ఈ సీజన్ అమ్ముడుపోని ఐపీఎల్ స్టార్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ సురేశ్ రైనా.. తొలి మెగావేలంలో రూ. 2.6 కోట్ల భారీ ధర పలికాడు. అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత గుజరాత్ లయన్స్కు రెండేళ్లు కెప్టెన్గా ఉన్న రైనా మళ్లీ చెన్నై తరఫున బరిలోకి దిగాడు. ఈ సీజన్కు ముందు చెన్నై వదిలేయడంతో వేలంలో అతన్ని ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య.. తొలిసారి 2015లో మెగావేలం బరిలోకి దిగాడు. అప్పుడు ముంబై ఇండియన్స్ రూ.10 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ సీజన్లో అరంగేట్రం చేసిన కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్కు సారథ్యం వహిస్తున్న పాండ్యా.. రూ. 16 కోట్లకు ఆ జట్టు తీసుకుంది.


Click it and Unblock the Notifications
