
అహ్మదాబాద్: ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందా? అంటే అవుననే చెబుతున్నారు అభిమానులు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం చూస్తేనే ఈ విషయం అర్థమవుతుందని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ చేజింగ్లోనే ఎక్కువ విజయాలు సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు ఓటమిపాలైంది.
లీగ్ దశలో గుజరాత్ సాధించిన 10 విజయాల్లో 7 సార్లు చేజింగ్ ద్వారానే గెలుపొందడం విశేషం. ఓడిన నాలుగు సార్లలో మూడు సార్లు ముందుగా బ్యాటింగ్ చేసే ఓటమిపాలైంది. ఆర్సీబీతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో కూడా గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేసే ఓటమిపాలైంది. చేజింగ్లో చూపించినంత పోరాటం.. లక్ష్యాన్ని కాపాడుకోవడంలో గుజరాత్ చూపించడం లేదు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్లో కూడా గుజరాత్ టాస్ గెలిచి చేజింగ్నే ఎంచుకుంది.
ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేస్తే రాజస్థాన్ పని సులువవుతుందని అంత భావించారు. కానీ టాస్ గెలిచిన సంజూ శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ డ్రైగా ఉండటంతో పాటు బ్యాటింగ్కు అనుకూలంగా ఉందని చెప్పాడు. అయితే వికెట్ మాత్రం పేసర్లకు అనుకూలంగా ఉందని స్పష్టంగా అర్థమైంది. అనూహ్య బౌన్స్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టింది. ఇలాంటి పిచ్పై సంజూ బ్యాటింగ్ ఎంచుకోవడంపైనే నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిక్స్ అయిందంటూ ఆరోపిస్తున్నారు. హోం మంత్రి అమిత్ షా విక్టరీ సింబర్ చూపించడం కూడా ఫిక్సింగ్లో భాగమేనని తెలుపుతున్నారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులు చేసింది. జోస్ బట్లర్(35 బంతుల్లో 5 ఫోర్లతో 39) మినహా అంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో హార్దిక్ మూడు వికెట్లు తీయగా.. సాయి కిషోర్ 2 వికెట్లు పడగొట్టాడు. షమీ, యశ్ దయాల్, రషీద్ తలో వికెట్ తీసారు.
అనంతరం గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్మన్ గిల్(43 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 45 నాటౌట్), డేవిడ్ మిల్లర్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 32 నాటౌట్), హార్దిక్ పాండ్యా(30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 34) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, ప్రసిధ్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.