
అహ్మదాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. లక్షా 25 వేల మంది అభిమానులు హాజరైన మైదానంలో బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్, మ్యూజిక్ దిగ్గజం ఏఆర్ రెహ్మాన్ తమదైన శైలిలో ఎంటర్టైన్ చేశారు. బాలీవుడ్తో పాటు సౌత్ సినిమా పాటలకూ రణ్ వీర్ సింగ్ స్టెప్పులేశాడు. యశ్ నటించిన కేజీఎఫ్తో పాటు తమిళ నటుడు విజయ్ నటించిన మాస్టర్ సినిమాలోని వాతీ సాంగ్కి కాలు కదిపాడు. బాహుబలితో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్లోని 'నాటు నాటు పాట'ను తెలుగులో ప్లే చేయగా.. రణ్వీర్ సింగ్ స్టెప్పులేయడంతో స్టేడియంలోని అభిమానులు హర్షధ్వానాలతో హోరెత్తించారు.
ప్రస్తుతం నాటు నాటుకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. వరల్డ్ బెస్ట్ లీగ్ అయిన ఐపీఎల్ ముగింపు వేడుకల్లో తెలుగు పాటను ప్లే చేయడం గొప్ప విషయమని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక కరోనా కారణంగా గత రెండేళ్లుగా ముగింపు వేడుకలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) దూరంగా ఉండగా.. ఈ సారి అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈ క్లోజింగ్ సెరమనీకి టీమిండియా మాజీ హెడ్ కోచ్, ప్రముఖ కామెంటేటర్ రవి శాస్త్రి హోస్ట్గా వ్యవహరించాడు.
వేడుకలు ప్రారంభానికి ముందు ప్రపంచంలో అత్యంత పెద్ద జెర్సీని నిర్వాహకులు ఆవిష్కరించారు. అతిపెద్ద జెర్సీగా ఇది గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కింది. ఈ సర్టిఫికేట్ను బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీతో పాటు సెక్రటరీ జై షా, ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ అందుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తన డ్యాన్స్లతో వేడుకలను ప్రారంభించాడు.
రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వికెట్ బ్యాటింగ్కు అనుకూలంగా కనిపిస్తోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని సంజూ తెలిపాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా మాత్రం తాను టాస్ గెలిచినా చేజింగ్కే మొగ్గు చూపేవాడినని చెప్పాడు. ఇక బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్.. జైస్వాల్ వికెట్ కోల్పోయింది.