ఫ్యాన్స్.. మీకు థ్యాంక్స్..
ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనను ఉద్దేశించి ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశాడు. 'ఈ సీజన్లో మేం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోయాం. కానీ ఇలా జరగడం సహజమే. చాలా మంది క్రీడా దిగ్గజాలు ఇలాంటి విపత్క పరిస్థితులను ఎదుర్కొన్నారు. వరుస మ్యాచ్ల్లో ఓడినప్పటికీ నాకు ఈ జట్టు.. ఇక్కడి వాతావరణమంటే ఇష్టం. మా జట్టు పట్ల నమ్మకంతో పాటు విధేయత చూపిన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు'అని రోహిత్ పేర్కొన్నాడు.
ఫ్యాన్స్ సైతం భావోద్వేగం..
రోహిత్ ట్వీట్ పట్ల ఫ్యాన్స్ సైతం భావోద్వేగానికి గురవుతున్నారు. జట్టు ఓడినా.. గెలిచినా.. తాము ఎప్పటికీ మీ వెంటే ఉంటాం హిట్ మ్యాన్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ముంబై గొప్ప ప్రదర్శన చేసినప్పుడే కాదు.. ఇలాంటి కఠిన సందర్భాల్లోనూ అండగా నిలుస్తామని చెబుతున్నారు. ఒక బ్యాడ్ సీజన్.. వాస్తవాన్ని మార్చలేదంటూ.. రోహిత్ సారథ్యంలోని ముంబై జట్టు ఐదుసార్లు టైటిల్ నెగ్గిందని, ఆల్టైమ్ బెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మనే అంటూ కామెంట్ చేస్తున్నాడు.
పరుగులు చేయకున్నా సరే.. 20 ఓవర్లు ఆడు..
రోహిత్ శర్మ ట్వీట్కు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సైతం బదులిచ్చింది. స్ట్రాంట్టుగెదర్ అనే హ్యాష్ ట్యాగ్తో.. మనమంతా కలిసికట్టుగా మళ్లీ గెలుపు బాట పడదాం అనే ఉద్దేశాన్ని వెలిబుచ్చింది. ముంబై ఇండియన్స్ ట్వీట్కు స్పందిస్తూ ఓ అభిమాని కీలక సలహా ఇచ్చాడు. 'రోహిత్ భాయ్.. నీకు సలహా ఇచ్చే స్థాయి నాది కాకపోవచ్చు గానీ.. నాదో చిన్న సలహా. నువ్వు 50 బంతులాడి 5 పరుగులు చేసినా ఫర్వాలేదు కానీ 20 ఓవర్లు పూర్తయ్యే వరకు క్రీజులో ఉండు. నువ్వు క్రీజులో నిలబడితే చాలు జట్టులోని మిగతా ఆటగాళ్లలో విశ్వాసం పెరుగుతుంది' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
సూర్యుడు ఉదయిస్తాడు..
2018లో టెస్టు జట్టులో చోటు కోల్పోయిన అనంతరం రోహిత్ శర్మ.. 'రేపు మళ్లీ సూర్యుడు ఉదయిస్తాడు'అని చేసిన ట్వీట్ను ఫ్యాన్స్ ఇప్పుడు రీట్వీట్ చేస్తున్నారు. లాంగ్ ఫార్మాట్లో జట్టులో చోటును కోల్పోయిన స్థితి నుంచి ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో టీమిండియాకు నాయకత్వం వహించే స్థాయికి చేరుకున్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఐపీఎల్లో రాణించకపోయినా పర్లేదని, భారత్కు టీ20 ప్రపంచకప్ అందిస్తే సరిపోతుందని కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications
