
కోల్కతా: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న కీలక ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం అంతరాయం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ చావో రేవో మ్యాచ్ కోసం ఇరు జట్లు స్వల్ప మార్పులు చేశాయి. ఆర్సీబీలోకి మహమ్మద్ సిరాజ్ రీఎంట్రీ ఇవ్వగా.. లక్నో జట్టులో కృష్ణప్ప గౌతమ్, జాసన్ హోల్డర్ ఉద్వాసనకు గురయ్యారు. దుష్మంత్ చమీరా, కృనాల్ పాండ్యా అవకాశం దక్కించుకున్నారు.
పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే సిరాజ్కు మళ్లీ అవకాశం ఇచ్చామని డుప్లెసిస్ తెలిపాడు. ఇది ఇప్పటికే ఉపయోగించిన వికెటని, బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని తెలిపాడు. మైదానం కూడా చాలా చిన్నదని, భారీ స్కోర్ చేయవచ్చన్నాడు. డ్రెస్సింగ్ రూమ్లో ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యమని చెప్పిన ఫాఫ్.. తమ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లున్నారని తెలిపాడు. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చామని, అదే జోరును కొనసాగిస్తామని చెప్పాడు. ఇక ఢిల్లీ, ముంబై మధ్య జరిగిన మ్యాచ్ను ప్రేక్షకులుగా ఆస్వాదించామని, కానీ ఈ రోజు అద్భుతమైన క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉందని చెప్పాడు.
బ్యాటింగ్కు అనుకూలమైన వికెట్ కావడంతో.. లక్ష్యం ముందే తెలిస్తే సులువవుతుందని ముందుగా బౌలింగ్ తీసుకున్నానని లక్నో సారథి రాహుల్ తెలిపాడు. అలాగే స్వింగ్ బౌలింగ్తో ఆరంభంలోనే వికెట్లు తీసి ఆర్సీబీని ఒత్తిడికి గురిచేయాలనుకుంటున్నామని చెప్పాడు. ఈ మ్యాచ్కు గౌతమ్, జాసన్ దూరమయ్యారని, కృనాల్, చమీరా బరిలోకి దిగుతున్నారని తెలిపాడు. జట్టులో ఆటగాళ్లంతా ఈ మ్యాచ్ కోసం ఉత్సహంగా ఉన్నారని చెప్పాడు.
లీగ్ దశలో ఈ రెండు జట్లు ఏప్రిల్ 19న డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఒకే ఒక మ్యాచ్లో తలపడగా.. ఆ మ్యాచ్లో బెంగళూరు టీమ్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో.. ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని లక్నో ఆశిస్తుండగా.. ఆ మ్యాచ్లో కనబర్చిన ప్రదర్శనను పునరావృతం చేయాలని బెంగళూరు ఉవ్విళ్లూరుతోంది. అయితే విరాట్ కోహ్లీ ఆడే కీలక మ్యాచ్లకు ఎప్పుడూ వరణుడు అడ్డంకి కలిగిస్తూనే ఉన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్, డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ల్లో కూడా వర్షం కారణంగానే టీమిండియా ఓటమిపాలైంది.
తుది జట్లు:
ఆర్సీబీ: ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, గ్లేన్ మ్యాక్స్వెల్, మహిపాల్ లోమ్రార్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, వానిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హేజిల్వుడ్, మహ్మద్ సిరాజ్
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (కేప్టెన్), ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మనన్ వోహ్రా, మార్కస్ స్టొయినిస్, మోహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్.