
కోల్కతా: ఐపీఎల్ 2022 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) యువ ప్లేయర్ రజత్ పటీదార్(54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్లతో 112 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. దాంతో లక్నో సూపర్ జెయింట్స్ ముందు ఆర్సీబీ 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఈ శతకంతో పటీదార్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 15 ఐపీఎల్ చరిత్రలో ప్లే ఆఫ్స్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాటర్గా పటీదార్ గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో వృద్దిమాన్ సాహా రికార్డును సమం చేశాడు. సాహా 49 బంతుల్లో సెంచరీ సాధించగా.. పటీదార్ కూడా 49 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఐపీఎల్లో సెంచరీ సాధించిన నాలుగో అన్ క్యాప్డ్ ప్లేయర్గా నిలిచాడు.
కీలక మ్యాచ్లో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆర్సీబీ కేజీఎఫ్ (కోహ్లీ(25), గ్లేన్ మ్యాక్స్వెల్(9), ఫాఫ్ డుప్లెసిస్(0)) విఫలమైన వేళ.. పటీదార్ జట్టుకు ఊపిరయ్యాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ సెంచరీ హీరోను మెగా వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయలేదు. రూ.20 లక్షల కనీస ధరకు అందుబాటులో ఉన్న అతన్ని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. గత సీజన్లో ఆర్సీబీకే ఆడిన పటీదార్.. పెద్దగా రాణించలేదు. దాంతో అతన్ని వదిలేసిన ఆర్సీబీ.. మళ్లీ కొనుగోలు చేయలేదు. కనీసం ఎక్స్ట్రా ప్లేయర్గా జట్టులో ఉంచుకునేందుకు కూడా ఆసక్తి చూపలేదు.
అయితే జట్టులోని యువ ప్లేయర్ లువ్నీత్ సిసోడియా గాయపడటంతో అతని ప్లేస్లో రీప్లేస్మెంట్గా తీసుకుంది. అయితే ఆరంభ మ్యాచ్ల్లో అనూజ్ రావత్కు అవకాశం ఇచ్చిన ఆర్సీబీ.. అతను విఫలమవడంతో కోహ్లీని ఓపెనర్గా ప్రమోట్ చేసి.. పటీదార్ను ఫస్ట్ డౌన్లో ఆడించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న పటీదార్ నిలకడగా పరుగులు చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. గుజరాత్ టైటాన్స్తో తొలి హాఫ్ సెంచరీ అందుకున్న పటీదార్.. సన్రైజర్స్పై 48 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన పటీదార్.. 275 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ ఉంది. అనూహ్యంగా జట్టులోకి వచ్చిన పటీదార్.. ఆర్సీబీకి కీలక ఆటగాడిగా మారాడు. ప్రస్తుతం పటీదార్పై ప్రశంసల జల్లు కురుస్తోంది.