

ముంబై: ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 సీజన్కు సమయం ఆసన్నమైంది. ప్రపంచ క్రికెట్ అభిమానులందరినీ ఏకం చేసి సహచరుల్ని ప్రత్యర్థుల్లా.. ప్రత్యర్థుల్ని సహచరుల్లా మార్చే ఈ టోర్నీ మరో నాలుగు రోజుల్లో మొదలవ్వనుంది. రెండు కొత్త జట్ల రాకతో ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా ఉండనుంది. నయా టీమ్స్ చేరికతో మ్యాచ్ల సంఖ్య పెరిగింది. ఇక కరోనా వైరస్ నేపథ్యంలో గతేడాది అనుభవం దృష్ట్యా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అత్యంత పకడ్బందీ ప్రణాళికలను రచిస్తోంది. ఈ సీజన్లో 70 లీగ్ మ్యాచ్లను మహారాష్ట్రకే పరిమితం చేసిన బీసీసీఐ.. నాలుగు మైదానాల్లో మ్యాచ్లు నిర్వహించనుంది.
వాంఖడేతో పాటు బ్రౌబౌర్న్, పుణే, డీవై పాటిల్ మైదానాల్లో మ్యాచ్లు జరగనున్నాయి. అయితే 70 మ్యాచ్లు నాలుగు మైదానాల్లో జరుగుతుండటంతో పిచ్లు జీవం కోల్పోకుండా బీసీసీఐ సూపర్ ప్లాన్ రెడీ చేసింది. ప్రతి స్టేడియంలో ఐదు పిచ్లను సిద్ధం చేస్తోంది. ఐపీఎల్ 2021 సెకండాఫ్ యూఏఈలో నిర్వహించగా... అక్కడి స్టేడియాల్లోని పిచ్లు తొలుత బాగానే ఉన్నప్పటికీ.. మ్యాచ్లు గడుస్తున్నా కొద్ది పూర్తిగా నెమ్మదించాయి. చివర్లో జరిగిన మ్యాచ్లన్నీ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యాయి. ఒకే స్టేడియంలో ఎక్కువ మ్యాచ్లు వరుసగా నిర్వహించడం వల్ల ఈ సమస్య తలెత్తింది. పిచ్లు జీవం కోల్పోయాయి. దీని ప్రభావం ఐపీఎల్పై పెద్దగా కనిపించకున్నా.. ఆ తర్వాత జరిగిన టీ20 ప్రపంచకప్లో స్పష్టంగా తెలిసొచ్చింది.
మెగా టోర్నీలో టాస్ గెలిచిన జట్లే విజయాలందించాయి. ఫస్ట్ లీగ్ మ్యాచ్ నుంచి ఫైనల్ వరకు దాదాపు టాస్ గెలిచిన జట్లే విజయాలందుకున్నాడు. ఒకటి రెండు చిన్న దేశాల మ్యాచ్ ఫలితాలు తప్పా మిగతావన్నిటిపై టాస్ ప్రభావం చూపించింది. ఇక భారత జట్టు సైతం టాస్ ఓడి వరుసగా రెండు మ్యాచ్లు ఓడింది. చివరకు మూడు గెలిచినా.. సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. ఈ పరిస్థితుల్లోనే బీసీసీఐ ఈ పరిస్థితి తలెత్తకుండా ఈసారి కొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. ఒక్క మైదానంలో ఐదు పిచ్లను సిద్దం చేసి మొత్తం 20 పిచ్ల్లో 70 మ్యాచ్లు నిర్వహిస్తామని తెలిపింది. ఈ లెక్కన ఒక్క పిచ్పై నాలుగు మ్యాచ్ల కంటే ఎక్కువగా జరగవు.
మార్చి 26 నుంచి ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. డిఫెండింగ్ చాపింయన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరిగే ఫస్ట్ మ్యాచ్తో ఈ క్యాష్ రిచ్ లీగ్కు తెరలేవనుంది.