
బెంగళూరు: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ స్ట్రాటజీ అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తోంది. అసలు వారి ప్రణాళికలు ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. శనివారం జరిగిన వేలంలో స్టార్ ప్లేయర్లందరినీ వదిలేసిన సన్రైజర్స్ అనామక ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించింది. దాంతో అభిమానులు తీవ్ర ఆగ్రహనికి గురయ్యారు. అయితే ఆదివారం మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ తమ ఫస్ట్ బిడ్తోనే ఆకట్టుకుంది. సౌతాఫ్రికా విధ్వంసకర ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్ను రూ.2.60 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వేలంలో మొత్తంలో సన్రైజర్స్ హైదరాబాద్ చేసిన మంచి పని ఏదైనా ఉందా? అంటే ఇది ఒక్కటే.
అయితే వేలంలో సన్రైజర్స్ ఓనర్ కావ్య మారన్, ఆమె పక్కన ఉన్న వ్యక్తి పదే పదే ఫోన్లో మాట్లాడటం అభిమానులకు చికాకు తెప్పించింది. ప్రతీ బిడ్కు వారు ఫోన్లో సంప్రదించి నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే వారు పదే పదే ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరా? అని ప్రతీ ఒక్కరికి అనిపిస్తుంది. అయితే సన్రైజర్స్ టీమ్ వర్గాల ప్రకారం వాళ్లు మాట్లాడేది కెప్టెన్ కేన్ విలియమ్సన్తోనే అని తెలిసింది. కేన్ మామ ఎంపికతో టీమ్ సెలెక్షన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక శనివారం వేలంలో హైదరాబాద్ 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఇందులో ఇద్దరు ఓవర్సీస్ ఆటగాళ్లను తీసుకున్న సన్రైజర్స్.. రూ.69.85 కోట్లు ఖర్చు చేసింది. దాంతో టీమ్లోని ఆటగాళ్ల సంఖ్య 13కి చేరగా.. పర్స్లో రూ.20.15 కోట్లు ఉన్నాయి.
ఆరంభంలో ప్లేయర్ల కోసం సన్రైజర్స్ హైదరాబాద్ కనీసం బిడ్ కూడా వేయలేదు. స్టార్ ఆటగాళ్లందరినీ వదిలేసింది. వేలంలోకి మొదటగా వచ్చి 30 మంది ప్లేయర్లలో ఆరెంజ్ ఆర్మీ ఒక్కరిని కూడా కొనలేదు. మనీశ్ పాండే కోసం తొలి బిడ్ వేసిన సన్రైజర్స్.. వాషింగ్టన్ సుంధర్ను తొలి ఆటగాడిగా ఎంచుకుంది. మార్కీ ప్లేయర్లతో పాటు క్యాప్డ్ బ్యాట్స్మన్లను వదిలేసింది. ఇక ఇషాన్ కిషన్ కోసం రూ.15 కోట్ల వరకు బిడ్ వేసింది. కానీ ముంబై ఇండియన్స్తో పోటీ పడలేక చేతులెత్తేసింది. ఇక ఆదివారం మార్క్రమ్ను తీసుకున్న సన్రైజర్స్ లివింగ్ స్టోన్కు బిడ్ చేయకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.