
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్కు కరోనా వైరస్ సెగ తగిలింది. అత్యంత పకడ్బందీ చర్యలతో కఠిన బయో బబుల్లో మ్యాచ్లు నిర్వహిస్తున్నా మహమ్మారి.. బుడగను చీల్చుకొని వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఫిజియో ప్యాట్రిక్ ఫర్హార్ట్, ఆల్రౌండర్ మిచెల్ మార్ష్, డాక్టర్ అభిజిత్ సాల్వి, మసాజ్ థెరపిస్ట్ చేతన్ కుమార్, సోషల్ మీడియా కంటెంట్ సభ్యుడు ఆకాశ్ మనేలకు వైరస్ సోకగా... తాజాగా మరో ఫారిన్ ప్లేయర్ టీమ్ సీఫెర్ట్ వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. సదరు ప్లేయర్ బయటికి రాకపోయినప్పటికీ.. పంజాబ్ కింగ్స్తో మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే మ్యాచ్పై నీలినీడలు కమ్ముకున్నాయి.
టీమ్ సీఫెర్ట్ మంగళవారం ట్రైనింగ్ సెషన్లో పాల్గొన్నాడు. మిగిలిన ఆటగాళ్లందరితో చనువుగా తిరిగాడు. ఈ క్రమంలోనే పంజాబ్తో జరిగే నేటి మ్యాచ్ వాయిదా పడనుంది. వాస్తవానికి ఫిజియో ప్యాట్రిక్ ఫర్హార్ట్, మిచెల్ మార్ష్లతో పాటు ఐదుగురికి వైరస్ సోకగానే బీసీసీఐ అప్రమత్తమైంది. మ్యాచ్ వేదికను పుణే నుంచి ముంబైకి తరలించింది. ఈ మ్యాచ్ కోసం పుణేకు వెళ్లకుండా జట్టు ప్రస్తుతం బస చేసిన చోటే (ముంబై) ఉంచి వైరస్ సంక్రమణ నిరోధక చర్యలు చేపట్టింది. మంగళవారం చేసిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షలన్నీ నెగెటివ్గా వచ్చినా.. బుధవారం నాటి టెస్టులే కీలకమని బీసీసీఐ వైద్య బృందం భావించింది
ముందస్తు చర్యల్లో భాగంగా మ్యాచ్కు ముందు మరోసారి ఈ ఉదయం ఢిల్లీ ఆటగాళ్లందరికీ ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షల్లో ఓ ఫారిన్ ప్లేయర్ వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ ఫ్రాంచైజీతో పాటు ఐపీఎల్ నిర్వాహకులు, బీసీసీఐ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరో గంటలో ఈ విషయంపై క్లారిటీ రానుంది.