బరోడా విడగొడితే..
2020 దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముందు కృనాల్ పాండ్యా, దీపక్ హుడా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బరోడా టీమ్ కెప్టెన్ అయిన కృనాల్ పాండ్యా అకారణంగా తనపై నోరు పారేసుకున్నాడని.. టీమ్ సభ్యులు, ఇతర టీమ్స్ ముందు తన పరువుకు భంగం కలిగించాడని వైస్ కెప్టెన్ దీపక్ హుడా సంచలన ఆరోపణలు చేశాడు.
అంతేకాకుండా తాను జట్టును వీడుతున్నట్లు కూడా ప్రకటించాడు. ఈ వివాదం భారత క్రికెట్లో పెనుదుమారం సృష్టించడంతో విచారణ చేపట్టిన బరోడా క్రికెట్ అసోసియేషన్(బీసీఏ) తప్పు దీపక్ హుడాదేనని తేల్చి అతన్ని టీమ్ నుంచి సస్పెండ్ చేసింది. దాంతో హుడా ఆ సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడలేదు. బరోడా టీమ్కు గుడ్బై చెప్పి రాజస్థాన్ టీమ్ తరఫున బరిలోకి దిగాడు.

లక్నో కలిపింది..
అప్పటి నుంచి ఈ ఇద్దరూ ఉప్పు-నిప్పుగా ఉంటున్నారు. అయితే ఐపీఎల్ 2022 సీజన్ రూపంలో మళ్లీ ఒకే జట్టు తరఫున బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ) టీమ్.. ఈ ఇద్దరు ఆల్రౌండర్లను కొనుగోలు చేసింది. ముందుగా దీపక్ హుడాను రూ.5.75 కోట్లకు తీసుకున్న లక్నో.. ఆ తర్వాత కృనాల్ పాండ్యాను రూ.8.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే మిడిలార్డర్ కీలకం కానున్న ఈ ఇద్దరూ కలిసి ఆడాల్సి వస్తే.. వీరి విబేధాలు జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఫస్ట్ మ్యాచ్లోనే దీపక్ హుడా- కృనాల్ కలిసిపోయి ఆకట్టుకున్నారు.

దీపక్ హుడా హాఫ్ సెంచరీ
అరంగేట్ర ఐపీఎల్ మ్యాచ్లోనే లక్నో సూపర్ జెయింట్స్ యువ ఆటగాడు ఆయూష్ బాదోని(41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 29/4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును సీనియర్ ప్లేయర్ దీపక్ హుడా(41 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 55)తో కలిసి ఆదుకున్నాడు. దాంతో 100 పరుగుల్లోపే ఆలౌటవుతదని భావించిన లక్నో.. గుజరాత్ ముందు 159 పరుగులు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. ఈ ఇద్దరు 5వ వికెట్కు 87 పరుగులు జోడించడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా(13 బంతుల్లో 3 ఫోర్లతో 21 నాటౌట్) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా..ఆరోన్ ఫించ్ రెండు, రషీద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.


Click it and Unblock the Notifications












