
పుణే: ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 లీగ్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ కారణంగా విడిపోయిన టీమిండియా ప్లేయర్లు దీపక్ హుడా, కృనాల్ పాండ్యా.. ఐపీఎల్ 2022 సీజన్ సందర్భంగా మళ్లీ కలిసారు. ఈ ఇద్దరూ లక్నో సూపర్ జెయింట్స్కు ఆడుతున్నారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ఈ ఇద్దరు కలిసి ఎలా ఆడుతారోనని అంతా సందేహించగా.. ఫస్ట్ మ్యాచ్లోనే గొడవలన్నిటినీ మరిచిపోయి కలిసి పోయారు. ఒకరిని ఒకరు హత్తుకొని మేం మంచి స్నేహితులమని చాటి చెప్పారు.
సగం లీగ్ ముగిసినా ఈ ఇద్దరూ కలిసి బ్యాటింగ్ ఎక్కువ చేయలేదు. అయితే తాజాగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆ సందర్భం రాగా.. సమన్వయం లోపంతో ఒకరు రనౌటయ్యారు. ఏదైతే జరగకూడదని అంతా అనుకున్నారో అదే జరిగింది. వీరి పాత గొడవల కారణంగా లక్నో సూపర్ జెయింట్స్ తీవ్ర నష్టం జరిగింది.
క్రీజులో సెట్ అయి హాఫ్ సెంచరీ దిశగా నడిచిన దీపక్ హుడా(34).. జానీ బెయిర్ స్టో సూపర్ ఫీల్డింగ్ కారణంగా నిరాశగా వెనుదిరిగాడు. అర్ష్దీప్ సింగ్ వేసిన 14 ఓవర్ మూడో బంతిని కృనాల్ డీప్ స్క్వేర్ దిశగా ఆడి క్విక్ డబుల్కు ప్రయత్నించాడు. కానీ పాత గొడవలు గుర్తుకొచ్చి.. వీనితో ఎవడు ఆడేది అనుకున్నాడో ఏమో కానీ హుడా రెండో పరుగు తీయడంలో అలసత్వం ప్రదర్శించాడు.
దాంతో జానీ బెయిర్ స్టో బౌండరీ లైన్ వద్ద నుంచి విసిరిన బంతి నేరుగా వికెట్లను తాకింది. దాంతో హుడా నిరాశగా వెనుదిరిగాడు. హుడా తీరుపై కృనాల్ మైదానంలో అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇక అభిమానులు ఈ గొడవను ఉద్దేశించి తమదైన శైలిలో సెటైర్లు పేల్చుతున్నారు.
ఈ ఇద్దరూ ఇన్నాళ్లు నటించారని, మనసులో పాత గొడవలు అలానే ఉన్నాయని, ఈ రోజు అవి బయటపడ్డాయని కామెంట్ చేస్తున్నారు. ఇక అప్పటి వరకు పటిష్టంగా కనిపించిన లక్నో.. హుడా వికెట్తో పేకమేడలా కూలింది. కృనాల్ పాండ్యా(7), మార్కస్ స్టోయినీస్(1), ఆయుష్ బదోని(4), జాసన్ హోల్డర్(11) వరుసగా ఔటయ్యారు. దాంతో భారీ స్కోర్ చేస్తుందనుకున్న లక్నో స్వల్ప స్కోర్కే పరిమితమైంది.