
హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతలను మళ్లీ అందుకున్న మహేంద్ర సింగ్ ధోనీ తొలి మ్యాచ్లోనే అద్భుత విజయాన్నందుకున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన చెన్నై 13 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్, మహేంద్ర సింగ్ ధోనీ పలు రికార్డులు నమోదు చేశాడు.
ఈ మ్యాచ్తో దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ రికార్డును ధోనీ అధిగమించాడు. 2013లో రాజస్థాన్ రాయల్స్కు సారథిగా 40 ఏళ్ల 268 రోజుల వయసులో ద్రవిడ్ ముంబై ఇండియన్స్పై విజయం సాధించాడు. ఇప్పుడు ధోనీ 40 ఏళ్ల 298 రోజుల వయసులో హైదరాబాద్పై విజయం సాధించి ఆ రికార్డును అధిగమించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. దాంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 200 ప్లస్ రన్స్ చేసిన జట్టుగా సీఎస్కే చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) రికార్డును అధిగమించింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు సీఎస్కే 22 సార్లు 200కు పైగా పరుగులు చేయగా.. ఆర్సీబీ 21 సార్లు చేసింది.
తొలి వికెట్కు రుతురాజ్ గైక్వాడ్ (99), డేవాన్ కాన్వే (85) కలిసి 182 పరుగులను జోడించారు. ప్రస్తుత సీజన్లో ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. చెన్నైకి కూడా ఇదే హయ్యెస్ట్ ఓపెనింగ్. అంతకుముందు 2020 సీజన్లో వాట్సన్-డుప్లెసిస్ (181) జోడించారు. ఒక్క పరుగు దూరంలో సెంచరీని మిస్ చేసుకున్న ఐదో బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (99). రుతురాజ్ కాకుండా విరాట్, పృథ్వీషా , ఇషాన్ కిషన్, క్రిస్ గేల్ ఉన్నారు.
వరుసగా ఐదు విజయాలను నమోదు చేసిన హైదరాబాద్ మరోసారి వరుసగా రెండో పరాజయం నమోదు చేసింది. అత్యంత వేగవంతమైన బౌలర్గా ఉమ్రాన్ మాలిక్ రికార్డు సృష్టించాడు. 154 కి.మీ వేగంతో బంతిని సంధించాడు. ఇదే వేగంతో రెండుసార్లు బంతిని విసరడం విశేషం. రవీంద్ర జడేజా నుంచి జట్టు పగ్గాలను అందుకుని తొలి విజయం నమోదు చేసిన ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.