
సంవత్సరాలు మారినా..
ఇక సంవత్సరాలు మారుతున్నాయి... జట్లలో ఆటగాళ్లూ మారుతున్నారు... కొత్తగా కొన్ని జట్లు వచ్చాయి, పోయాయి... మళ్లీ కొత్త జట్లు వచ్చాయి... ఐదు సార్లు విజేతలైనవారు ఒకవైపు ఉంటే ఒక్కసారి కూడా ట్రోఫీని అందుకోలేక ప్రయత్నం సాగిస్తున్నవారూ మరోవైపు ఉన్నారు... వేలంలో అంకెల లెక్కలకు రెక్కలొచ్చాయి... ఆపై అంబరాన్ని తాకేలా టోర్నీ విలువ పెరుగుతూ పోయింది... ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఏదో రూపంలో ఇందులో భాగమైతే చాలనుకుంటుంటే దేశం తరఫున ఆడతారా లేదా అంటూ విధేయత చూపాల్సి వస్తే ఇక్కడికే వచ్చేందుకే ఆటగాళ్లు సిద్ధమైపోతున్నారు!
ఎన్ని మారినా 14 ఏళ్లుగా మారనిది ఒక్కటే! అదే ఇక్కడ లభించే ఎంటర్టైన్మెంట్.... ఫోర్లు, సిక్సర్లు, పరుగుల పండగ... ఎన్ని ఉద్వేగాలు, మరెన్నో ఉత్కంఠ క్షణాలు... మండు వేసవిలో చల్లని జల్లులా సగటు క్రికెట్ అభిమాని ఉత్సాహంతో ఊగిపోయే క్రికెట్ వేడుక ఇది.. ఈ రెండు నెలలు ఫ్యాన్స్కు కిక్కే కిక్కు.

65 రోజులు.. 74 మ్యాచ్లు..
రెండు గ్రూప్లు.. పది జట్లు.. 65 రోజులు.. 74 మ్యాచ్లు..! క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందు ఐపీఎల్ 15వ సీజన్ ముస్తాబైంది. కరోనా వల్ల 2020లో అరబ్ గడ్డపై మజాను పంచి.. పోయినేడాది రెండు విడతల్లో కిక్ ఇచ్చిన మెగా లీగ్ రెండేళ్ల తర్వాత ఇండియా అభిమానుల సమక్షంలో సందడి చేయనుంది. డిఫెండింగ్ చాంప్ చెన్నై సూపర్ కింగ్స్, గత రన్నరప్ కోల్ కతా నైట్ నైడర్స్ మధ్య శనివారం జరిగే తొలి మ్యాచ్తో ఈసీజన్కు తెరలేవనుంది.
నిరుడు కరోనా కారణంగా లీగ్ అర్ధాంతరంగా వాయిదా పడటం నుంచి పాఠాలు నేర్చుకున్న బోర్డు ఈసారి బయోబబుల్ లో ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిపేందుకు పక్కా ఏర్పాట్లు చేసింది. ట్రావెలింగ్, ప్లేయర్ల భద్రత దృష్టిలో పెట్టుకుని కేవలం ముంబై, పుణెల్లోనే లీగ్ మ్యాచ్లను నిర్వహించాలని నిర్ణయించింది. మే 22న సన్ రైజర్స్ పంజాబ్ మధ్య జరిగే మ్యాచ్ తో లీగ్ మ్యాచ్లు ముగుస్తాయి. మే 29న ఫైనల్ జరగనుంది. ప్లే ఆఫ్స్, ఫైనల్ షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది.

బోణీ ఎవరిదో!
డిఫెండింగ్ చాంప్ చెన్నై సూపర్ కింగ్స్, నిరుడు రన్నరప్ కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య శనివారం రాత్రి మ్యాచ్ జరగనుంది. వాంఖడే స్టేడియంలో జరిగే ఈ పోరులో గెలిచి లీగ్ లో బోణీ కొట్టాలని రెండు జట్లు భావిస్తున్నాయి. ఈ రెండు టీమ్స్ ఈసారి కొత్త కెప్టెన్లతో బరిలో దిగబోతుండటం మరో విశేషం. సీజన్ కు రెండు రోజుల ముందు కెప్టెన్ గా తప్పుకొంటున్నట్లు ప్రకటించిన ధోనీ.. జడేజాకు కెప్టెన్సీ అప్పగించాడు. దీంతో ఇప్పటివరకు ఫుల్ టైమ్ కెప్టెన్ గా అనుభవం లేని జడ్డూ ఈసారి టీమ్ ను ఎలా నడిపిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక నిరుడు ఇంగ్లండ్ ప్లేయర్ ఇయాన్ మోర్గాన్ నాయకత్వంలో ఫైనల్ వరకు వెళ్లిన కేకేఆర్.. ఈసారి అతడిని వేలానికి ముందే వదిలేసింది. ఆ తర్వాత వేలంలో టీమిండియా యంగ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ను తీసుకుని అతడికి కెప్టెన్సీ అప్పగించింది. ఇంతకుముందు 2020లో ఢిల్లీకి కెప్టెన్ గా టీమ్ ను ఫైనల్ వరకు తీసుకెళ్లిన అయ్యర్ పై మంచి అంచనాలున్నాయి.

ధోనీకి ఫేర్వెల్ సీజన్!
ఈ సీజన్ కు ముందు సీఎస్కే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఎంఎస్ ధోనీ.. ఫ్యాన్స్ కు మరో షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. 40 ఏళ్ల ధోనీకి ఈ సీజన్ చివరిదని చాలామంది భావిస్తున్నారు. ఒకవేళ ఈ సీజన్ తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తే.. తర్వాత ఎడిషన్ లో సీఎస్కేకు మహీ మెంటార్ గా వ్యవహరించే చాన్సుంది. ఆర్సీబీ కెప్టెన్సీ వదులుకున్న కోహ్లీపై కూడా అందరి దృష్టి ఉంది. ఓ ప్లేయర్గా తను ఎలా ఆడతాడనే దానిపై ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications
