న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను మరింత జనరంజకరగా మార్చే ఉద్దేశంతో రెండు కొత్త జట్లను చేర్చాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) భావించింది. వచ్చే ఏడాది జరిగే 15వ సీజన్ నుంచే మొత్తం 10 జట్లతో లీగ్ను ఆడించాలనే ఆలోచన చేసింది. ఇందుకు సంబంధించి టెండర్లను కూడా పిలవాలనుకుంది.
ఇప్పటికే సగం మ్యాచ్ల తర్వాత అర్ధంతరంగా లీగ్ను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈనేపథ్యంలో రెండు జట్ల కోసం టెండర్లను కూడా ఇప్పట్లో ఆహ్వానించకూడదని బోర్డు ఆలోచిస్తోంది. ప్రస్తుతం దృష్టంతా మిగిలిన సీజన్ను ఎలా నిర్వహించాలనే దానిపైనే ఉన్నట్టు సమాచారం. 'కొత్త జట్ల చేరికపై ప్రస్తుతం బీసీసీఐ ఎలాంటి ఆలోచన చేయడం లేదు. జూలై వరకైతే ఈ విషయంలో ఎలాంటి కదలిక ఉండకపోవచ్చు. తాజా సీజన్ను ఎలా.. ఎప్పుడు పూర్తి చేయాలనే విషయంపై బోర్డు ఆలోచనలున్నాయి. ఈ విషయం ఓ కొలిక్కి వచ్చాకే ఆ రెండు టీమ్స్పై తేలుస్తారు'అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.
ఐపీఎల్ను ఎనిమిది జట్లతో కాకుండా 2022 నుంచి 10 జట్లతో నిర్వహిస్తామని ఈ ఏడాది ఆరంభంలో బోర్డు అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా వెల్లడించారు. అలాగే 14వ సీజన్ ముగిశాక వీటి కోసం టెండర్లు పిలవాలని భావించారు. అయితే కొవిడ్ ధాటికి అంతా తారుమారైంది. మరోవైపు తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఏడాది జరగాల్సిన మెగా ఆటగాళ్ల వేలం కూడా ఉండకపోవచ్చని, ఈ ఏడాది జరిగిన మినీ వేలం లాంటిదే నిర్వహించవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇక ఐపీఎల్ సెకండాఫ్ నిర్వహణ కూడా కష్టంగా మారింది. మిగిలిన 31 మ్యాచ్ల నిర్వహణకు ఇంగ్లండ్, యూఏఈ, శ్రీలంక దేశాలు ముందుకు వచ్చినా క్రికెటర్లు ఆడటానికి సిద్దంగా లేరు. ఆయా దేశాల క్రికెట్ బోర్డులు తమ క్రికెటర్లు జాతీయ జట్టు కే ఆడతారని, ఐపీఎల్ ఆడబోరని తేల్చి చెబుతున్నాయి. అవసరమైతే టీ20 వరల్డ్కప్ను కాస్త వెనక్కు జరిపి ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నది.
ఈ మేరకు ఐసీసీ వద్ద ప్రతిపాదన పెట్టినా ఎగ్జిక్యూటీవ్ సభ్యులు దాన్ని తిరస్కరించినట్లు సమాచారం. ఇంగ్లండ్లో మిగతా సీజన్ నిర్వహిస్తే కనీసం ఆ దేశ క్రికెటర్లు అయినా ఐపీఎల్లో పాల్గొంటారని బీసీసీఐ భావించింది. కానీ ఈసీబీ ఈ ఏడాదికి పూర్తి షెడ్యూల్ ప్రకటించింది. 2023 వన్డే వరల్డ్ కప్ కోసం జరగనున్న సూపర్ లీగ్ షెడ్యూల్కు అంతరాయం ఏర్పడకుండా ఇప్పట్లో ఐపీఎల్ నిర్వహించడం కష్టమే.