
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్కు సంబంధించి అభిమానులకు శుభవార్త. కరోనా కారణంగా గత రెండు సీజన్లుగా ఈ ధనాధన్ లీగ్ ఖాళీ మైదానాల్లో జరగ్గా.. అప్కమింగ్ సీజన్ మాత్రం ప్రేక్షకుల మధ్యే జరగనుంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిర్ణయం తీసుకుంది. ముందుగా మైదానాల సీటింగ్ కెపాసిటీలో 25 శాతం ప్రేక్షకులను అనుమతిస్తామని, కరోనా పరిస్థితుల్ని బట్టి ఈ సంఖ్యను పెంచుతామని బోర్డు ప్రకటించింది. ఇక ధనాధన్ లీగ్కు సమయం దగ్గరపడుతున్న వేళ 10 ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా గైడ్లైన్స్తో పాటు ఈ నెల 8 నుంచి జట్లన్నీ ముంబైకు చేరుకోవచ్చని తెలిపింది.
భారత్లోనే ఉన్నవారైతే మూడు రోజులు, విదేశాల నుంచి వచ్చే వారైతే ఐదు రోజుల పాటు క్వారంటైన్లో తప్పక గడపాల్సి ఉంటుందని ఆదేశించింది. ముంబైకి రావడానికి రెండు రోజుల ముందు తీసుకున్న ఆర్టీపీసీఆర్ రిపోర్టును మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. ఈ వివరాలు బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.
'ఐపీఎల్లో పాల్గొనే పది జట్లు వారి సిబ్బంది మార్చి 8 లోపు ముంబైకి చేరుకుంటాయి. 14-15 మధ్య ప్రాక్టీస్ను ప్రారంభిస్తాయి. టోర్నీలో పాల్గొనే వారంతా బయో బబుల్కు ముందు 3 నుంచి 5 రోజులు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉంటారు. ముంబై ప్రయాణానికి 48 గంటల ముందే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. 5 రోజుల క్వారంటైన్లో మూడుసార్లు పరీక్ష చేస్తాం. మొదటి రోజు ఒకటి, రెండో రోజు మరొకటి, చివరి రోజు కూడా పరీక్షలు చేస్తాం. ఈ మూడు పరీక్షల్లో నెగటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ నుంచి విడుదల చేస్తాం.
ప్రతి జట్టు ముంబై, పుణెలోని నాలుగు వేదికల్లోనే ఆడతాయి. వారి ప్రాక్టీస్ సెషన్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం. ఆటగాళ్లకు బయోబబుల్ నుంచి రక్షణ కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. బయోబబుల్లో ఆటగాళ్ల కదలికలను, నిబంధనల్ని పరిశీలిస్తాం. న్యూ ముంబై నుంచి పుణెకు ఆటగాళ్లు ప్రయాణించేటప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఒకవేళ ఎవరైనా కొవిడ్ పాజిటివ్గా తేలితే వారికి హోటల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం.'అని సదరు అధికారి తెలిపారు.
ఈ నెల 26 నుంచి మే 29 వరకు ఐపీఎల్ 2022 సీజన్ జరగనుంది. షెడ్యూల్ ఖారారు చేసిన బీసీసీఐ మ్యాచ్ల పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. మొత్తం 70 లీగ్ మ్యాచ్లను ముంబై, పుణెలోని స్టేడియాల్లో నిర్వహించనున్నారు. ప్లేఆఫ్ మ్యాచుల వేదికలను తర్వాత ప్రకటించనున్నారు. ముంబైలోని వాంఖడే మైదానం 20 మ్యాచులకు ఆతిథ్యం ఇస్తుండగా.. బ్రబౌర్న్ స్టేడియం 15 మ్యాచులకు, డీవై పాటిల్ స్టేడియంలో 20 మ్యాచులు జరగనున్నాయి. పుణెలోని ఎంసీఏ అంతర్జాతీయ స్టేడియంలో 15 మ్యాచులు నిర్వహించనున్నారు.