రస్సెల్ జిగేల్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఆండ్రీ రస్సెల్(28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 49 నాటౌట్), సామ్ బిల్లింగ్స్(29 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 34) రాణించగా... అజింక్యా రహానే(24 బంతుల్లో 3 సిక్స్లతో 28),నితీశ్ రాణా(16 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 26) ధాటిగా ఆడారు. సన్రైజర్స్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లతో చెలరేగగా.. భువీ, జాన్సెన్, నట్టూ తలో వికెట్ పడగొట్టారు.
అభిషేక్ మినహా..
అనంతరం సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్లతో 43), ఎయిడెన్ మార్క్రమ్(25 బంతుల్లో 3 సిక్స్లతో 32) మినహా అంతా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ మూడు వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.
కేన్ మామ మళ్లీ విఫలం...
178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్కు సరైన శుభారంభం దక్కలేదు. మరోసారి కెప్టెన్ కేన్ మామ(9) విఫలమయ్యాడు. రస్సెల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో సన్రైజర్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 31 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠితో కలిసి మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ధాటిగా ఆడటంతో సన్రైజర్స్ వేగంగా పరుగులు చేసింది. అయితే రాహుల్ త్రిపాఠి(9) సౌతికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరగ్గా.. ఆ కొద్దిసేపటికే హాఫ్ సెంచరీకి చేరువైన అభిషేక్ శర్మ(43) కూడా వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు.
పూరన్ సైతం..
ఆ కొద్దిసేపటికే నికోలస్ పూరన్(2)ను సునీల్ నరైన్ రిటర్న్ క్యాచ్గా పేవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత 3 సిక్స్లతో ధాటిగా ఆడిన ఎయిడెన్ మార్క్రమ్(32)ను ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో సన్రైజర్స్ హైదరాబాద్ 99 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత బరిలోకి దిగిన సుందర్(4), మార్కో జాన్సెన్(1)ను రస్సెల్ ఔట్ చేయగా.. శశాంక్ సింగ్(11)ను సౌథీ పెవిలియన్ చేర్చాడంతో సన్రైజర్స్ ఓటమి ఖాయమైంది. భువీ(6 నాటౌట్), ఉమ్రాన్ (3 నాటౌట్) ఆలౌటవ్వకుండా ఇన్నింగ్స్ను ముగించారు.