
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ తుది దశకు చేరుకుంది. లీగ్లో అత్యధిక టైటిళ్లు గెలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ అందరి కన్నా ముందే టైటిల్ రేసు నుంచి తప్పుకోగా.. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఊహించని రీతిలో ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. ఐదు సార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో అందరికన్నా ముందే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించగా.. నాలుగు టైటిళ్ల గెలిచిన సీఎస్కే ఆ జట్టు బాటలో నడిచింది. రెండు టైటిళ్లు గెలిచిన కేకేఆర్... లక్నో సూపర్ జెయింట్స్తో బుధవారం జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో 2 పరుగులతో ఓటమిపాలై ఇంటిదారిపట్టింది.
రెండు కన్నా ఎక్కువ సార్లు టైటిల్ గెలిచిన జట్లన్నీ రేసు నుంచి తప్పుకోగా.. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి. నేటి సాయంత్రం గుజరాత్ టైటాన్స్తో జరిగే మ్యాచ్లో ఆర్సీబీ గెలిచినా, ముంబైతో శనివారం జరిగే మ్యాచ్లో ఢిల్లీ గెలిచినా పంజాబ్, సన్రైజర్స్ హైదరాబాద్ ఇంటిదారిపట్టనున్నాయి. ఇక ఢిల్లీ గెలిస్తే ఆర్సీబీ కథ కూడా ముగియనుంది. అయితే చెన్నై, ముంబై, కేకేఆర్ లేకుండా ప్లే ఆఫ్స్ జరగనుండటం లీగ్ చరిత్రలో ఇదే తొలిసారి. దాంతో నయా చాంపియన్ను చూసే అవకాశం ఉందా? అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న జట్లలో రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మాత్రమే గతంలో ఒక్కోసారి టైటిల్ సాధించాయి. ఆర్సీబీ, ఢిల్లీ, పంజాబ్ గత 15 ఏళ్లుగా టైటిల్ కోసం నిరీక్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొత్తగా వచ్చిన జట్లు లక్నో, గుజరాత్తో పాటు టైటిల్ గెలవని టీమ్స్లో ఒక జట్టు విజేతగా నిలుస్తుందా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.