
కెప్టెన్గా చాన్స్..
ఐపీఎల్లో జట్లు రాణించాలంటే సమష్టి ప్రదర్శనతో పాటు టీమ్ను ముందుండి నడిపించే సమర్థవంతమైన నాయకుడు అవసరం. పరిస్థితులకు తగ్గట్లు మైదానంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. ముంబై ఇండియన్స్ ఐదు సార్లు, చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు టైటిల్ గెలవడంలో ఆయా జట్ల సారథులు ధోనీ, రోహిత్ శర్మ కీలకపాత్ర పోషించారు.
సరైన నాయకుడు లేక పంజాబ్ కింగ్స్, కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ గత కొన్నేళ్లుగా ఇబ్బంది పడుతున్నాయి. అయితే దేశవాళీ క్రికెట్లో కర్ణాటక జట్టుకు తన మేటి కెప్టెన్సీతో ఎన్నో టైటిల్స్ అందించిన మనీష్ పాండే కోసం వచ్చే సీజన్లో ఫ్రాంచైజీలు పోటీ పడుతాయని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా కేకేఆర్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలు తమ ఫ్యూచర్ కెప్టెన్ కోసం మనీష్ పాండేను తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఇక పాండే పెర్ఫామెన్స్ పట్ల సన్రైజర్స్ హైదరాబాద్ కూడా అసంతృప్తితో ఉంది. వచ్చే సీజన్లో అతన్ని అంటిపెట్టుకోవడం కష్టమే.

ఫస్ట్ టార్గెట్ కోల్కతా నైట్రైడర్స్దే.!
మనీష్ పాండే కోసం తొలుత కేకేఆరే పోటీపడనుంది. గౌతం గంభీర్ సారథ్యంలో రెండు సార్లు టైటిట్ నెగ్గిన ఆ జట్టు.. ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో మళ్లీ ట్రోఫీని అందుకోలేకపోయింది. ముఖ్యంగా కెప్టెన్సీ కొరత ఆ జట్టును తీవ్రంగా వేదిస్తోంది. 2018 మెగా వేలం సమయంలో దినేశ్ కార్తీక్ను తమ సారథిగా నియమించుకోగా.. తొలి రెండేళ్లు పర్వాలేదనిపించిన కార్తీక్ గతేడాది చేతులెత్తేశాడు.
సీజన్ మధ్యలోనే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ను కేకేఆర్ తమ సారథిగా నియమించుకుంది. అయినా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. గతేడాది ఐదో స్థానానికి పరిమితమైన ఆ జట్టు.. ఈ సారి మరీ పేలవ ప్రదర్శన కనబర్చింది. ఏడు మ్యాచ్ల్లో కేవలం రెండింటిలో మాత్రం విజయం సాధించింది. దాంతో వచ్చే సీజన్లో మనీష్ పాండేను తీసుకొని కెప్టెన్గా నియమించుకోవాలని ఆ ఫ్రాంచైజీ భావిస్తోంది.

పంజాబ్ కింగ్స్ సైతం..
ఇక పంజాబ్ కింగ్స్ సైతం మనీష్ పాండే కోసం పోటీ పడే అవకాశం ఉంది. ప్రతీ సీజన్లో ఆ జట్టు సరైన సారథి లేక సతమతమవుతోంది. లీగ్లోనే ఎక్కువ కెప్టెన్లను మార్చిన జట్టుగా నిలిచిన పంజాబ్ కింగ్స్.. వచ్చే సీజన్లో ఈ సమస్యకు స్వస్తి పలకాలనుకుంటుంది. 2018లో తొలుత అశ్విన్ను సారథిగా నియమించుకున్న పంజాబ్.. ఆ తర్వాత కేఎల్ రాహుల్ను సారథిగా ప్రకటించింది.
అతని సారథ్యంలో అద్భుత ప్రదర్శన కనబర్చినా.. ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. గతేడాది కనీసం ప్లే ఆఫ్స్కు కూడా క్వాలిఫై కానీ ఆ జట్టు ఈ సీజన్లో కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయింది. పైగా ఆ జట్టు బలహీనమైన మిడిలార్డర్తో బాధపడుతుంది. పాండేను జట్టులోకి తీసుకుంటే ఈ రెండు సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆ జట్టు భావిస్తోంది.

చెన్నై సూపర్ కింగ్స్ కూడా..
ఆశ్చర్యకరంగా మనీష్ పాండే కోసం చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్రయత్నించనుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సక్సెస్ఫుల్ టీమ్ అయిన సీఎస్కే.. ధోనీ సారథ్యంలో అద్భుతాలు చేసింది. అయితే ధోనీ కెరీర్ ముగింపుకు చేరుకోవడంతో ఆ జట్టు భవిష్యత్తుపై దృష్టిసారించింది. ఇప్పటికే ధోనీ పర్యవేక్షణలోనే కోర్ టీమ్ను సిద్దం చేసుకున్న సీఎస్కే.. అతని వారుసుడిగా పాండేను తీసుకోవాలనుకుంటుంది.
ధోనీ వచ్చే సీజన్ ఆడటం కష్టమేనని విషయం అందరికి తెలిసిందే. అయితే సురేశ్ రైనా, ఫాఫ్ డూప్లెసిస్ రూపంలో బెస్ట్ కెప్టెన్లు జట్టులో ఉన్నా.. వారు ఎక్కువ రోజులు కొనసాగలేరనే విషయం ఫ్రాంచైజీకి తెలుసు. అందుకే మనీష్ పాండేను తీసుకోవాలని భావిస్తోంది.


Click it and Unblock the Notifications












