
కెప్టెన్గా ఇదే ఆఖరి ఐపీఎల్
ఆర్సీబీ కెప్టెన్గా ఈ సీజనే తనకు ఆఖరిదని ఆదివారం విరాట్ కోహ్లీ ప్రకటించాడు. 'బెంగళూరు కెప్టెన్గా ఇదే నా ఆఖరి ఐపీఎల్. ఇది తేలికైన నిర్ణయం కాదు. కానీ ఫ్రాంఛైజీ ప్రయోజనాల దృష్ట్యా సరైందని భావిస్తున్నా. గతంలో చాలాసార్లు చెప్పినట్టుగా.. క్రికెటర్గా కెరీర్ ముగిసేవరకు ఐపీఎల్లో బెంగళూరు జట్టుకే ఆడతాను.
టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకన్నప్పటి నుంచి ఐపీఎల్లోనూ సారథ్య బాధ్యతలకు దూరం కావాలని ఆలోచిస్తున్నా. ఈ విషయంపై జట్టు సభ్యులతో చర్చించాను. ఆర్సీబీ జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప ప్రయాణం. ఈ అవకాశం కల్పించిన మేనేజ్మెంట్కు, నా ప్రయాణంలో భాగమైన కోచ్లు, ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి ధన్యవాదాలు' అని వీడియోలో కోహ్లీ అన్నాడు.

కెరీర్లో 200వ మ్యాచ్
ఐపీఎల్ ఆరంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు. 2013లో న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ వెటోరి నుంచి కోహ్లీ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. విరాట్ కెప్టెన్సీలో 2016లో ఫైనల్ చేరడమే బెంగళూరుకు అత్యుత్తమ ప్రదర్శన. పని భారం తగ్గించుకోవడం కోసం టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు కోహ్లీ ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే.
బెంగళూరు తరఫున కోహ్లీ ఇప్పటివరకు 199 మ్యాచ్లు ఆడాడు. 5 సెంచరీలు సహా 6076 పరుగులు చేశాడు. సోమవారం కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్ అతడి ఐపీఎల్ కెరీర్లో 200వ మ్యాచ్. ఒక ప్రాంచైజీ తరఫున ఇన్ని మ్యాచులు ఆడిన తొలి బ్యాట్స్మన్ కోహ్లీనే.
IPL 2021: 'రోహిత్ శర్మకు అందుకే విశ్రాంతి ఇచ్చాం.. కోల్కతాతో జరిగే మ్యాచ్లో ఆడుతాడు'

ఆర్సీబీకి టైటిల్ అందిస్తాడు
ఈ రోజు కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య అబుదాబి వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ఆర్సీబీ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించాడు. 'ఐపీఎల్ 2021 తిరిగి ప్రారంభమైనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆర్సీబీ సీజన్లో అద్భుతమైన ప్రారంభాన్ని కలిగి ఉంది. తొలి టైటిల్ను గెలుచుకునే అవకాశం మాకు ఉంది. విరాట్ కోహ్లీ భయ్యా ఈసారి తొలి టైటిల్కి ఆర్సీబీకి అందిస్తాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా' అని చహల్ ధీమా వ్యక్తం చేశాడు.

తొలి టైటిల్ గెలుస్తాం
'భారత జట్టైనా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయినా.. ఎల్లపుడూ పరుగులు సాధించడం, జట్టుకు విజయాన్ని అందించడంపైనే విరాట్ కోహ్లీ దృష్టిసారిస్తాడు. రెండు జట్ల (భారత్, ఆర్సీబీ)కు ఆడినపుడు కోహ్లీ నుంచి నాకు మార్గదర్శకత్వం లభించింది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సీజన్ను మేము చాలా గొప్పగా ప్రారంభించాం. ప్రస్తుతం మా ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. ఇదే గెలుపు జోరును కొనసాగిస్తాం. మా ప్లేయర్స్ అందరూ మంచి ఫాములో ఉన్నారు. బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లో ఆర్సీబీ పటిష్టంగా ఉంది. ఐపీఎల్ 2021కు ముందు ఆడిన మ్యాచులలో మా ఆటగాళ్లు అదరగొట్టారు. అదే ఫామ్ ఇక్కడ కూడా కొనసాగిస్తారు. తొలి టైటిల్ గెలవడానికి మాకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి' అని యుజ్వేంద్ర చహల్ ధీమా వ్యక్తం చేశాడు.

తొలి దశలో దుమ్మురేపిన ఆర్సీబీ
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఐపీఎల్ 2021 తొలి దశలో ఆర్సీబీ దుమ్మురేపింది. వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచి టైటిల్ ఆశలు రేకెత్తించింది. మునపటి ఫామ్ను కొనసాగిస్తే.. యూఏఈలో కూడా ఆర్సీబీకి తిరుగుండదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్తో పాటు గ్లెన్ మ్యాక్స్వెల్, ఏబీ డివిలియర్స్ జట్టుకు అందుబాటులో ఉండటంతో బ్యాటింగ్ బలంగా ఉంది.
పైగా తమ జట్టు మంచి స్థానంలో ఉండటంతో వీరంతా స్వేచ్చగా ఆడనున్నారు. అయితే ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ సేవలు కోల్పోవడం ఆర్సీబీకి కాస్త మైనస్. సుందర్ స్థానంలో విరాట్ ఎవరిని ఫైనల్ ఎలెవన్లో తీసుకుంటాడో చూడాలి. బౌలింగ్లోనూ ఆర్సీబీ బాగానే ఉంది. హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్కు తోడుగా హర్షల్ పటేల్, నవదీప్ సైనీ, కైల్ జెమీసన్తో లైనప్ బలంగా ఉంది.
ఫస్ట్ ఫేజ్లో అదరగొట్టిన హర్షల్పై ఈసారి కూడా భారీ అంచనాలున్నాయి. రెగ్యులర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఫామ్ జట్టును కాస్త కలవరపెడుతోంది. యువ ప్లేయర్ మహమ్మద్ అజారుద్దీన్తో పాటు కొత్తగా జట్టులోకి వచ్చిన వహిందు హసరంగా, దుష్మంతు చమీరా, టీమ్ డేవిడ్లో తుది జట్టులో ఎవరికి అవకాశం దొరకుతుందో చూడాలి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు (అంచనా)
విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్, గ్లేన్ మ్యాక్స్వెల్, ఏబీ డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, కైల్ జెమీసన్, వానిందు హసరంగా, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్.


Click it and Unblock the Notifications












