
దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్ టైటిల్ను చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) సొంతం చేసుకుంది. కోల్కతా నైట్రైడర్స్తో శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన చెన్నై 28 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో నాలుగో ఐపీఎల్ టైటిల్ను ఖాతాలో వేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (59 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 86) హాఫ్ సెంచరీతో రాణించగా.. మొయిన్ అలీ(20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 37 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్(27 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 32), రాబిన్ ఊతప్ప(15 బంతుల్లో 3 సిక్స్లతో 31) కీలక పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికెట్లు తీయగా.. శివం మావి ఓ వికెట్ తీశాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కోల్కతా నైట్రైడర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఓపెనర్లు శుభ్మన్ గిల్(43 బంతుల్లో 6 ఫోర్లతో 51), వెంకటేశ్ అయ్యర్(32 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీలతో తొలి వికెట్కు 91 పరుగులు జోడించినా.. ఇతర బ్యాట్స్మన్ వైఫల్యం ఆ జట్టు కొంపముంచింది. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, జోష్ హజెల్ వుడ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. డ్వేన్ బ్రావ్, దీపక్ చాహర్కు చెరొ వికెట్ లభించింది.
193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్కు ఓపెనర్లు శుభ్మన్ గిల్, వెకంటేశ్ అయ్యర్ మంచి శుభారంభాన్ని అందించారు. ఆరంభం నంచి ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు. వీరి దూకుండుకు కేకేఆర్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. అనంతరం మరింత దూకుడుగా ఆడిన ఈ జోడీ.. స్కోర్ బోర్డును పరుగెత్తింది. ఈ క్రమంలోనే అయ్యర్ 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నిలకడగా సాగుతున్న కోల్కతా ఇన్నింగ్స్ను లార్డ్ శార్డూల్ ఠాకూర్ దెబ్బతీశాడు. జోరుమీదున్న వెంకటేశ్ అయ్యర్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి 91 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణాను గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చాడు.
ఈ ఒక్క ఓవర్తో మ్యాచ్ మొత్తం సీఎస్కే వైపు మళ్లింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సునీల్ నరైన్(2)ను హజెల్ వుడ్ క్యాచ్ ఔట్గా బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత హాఫ్ సెంచరీతో జోరు కనబర్చిన శుభ్మన్ గిల్ను దీపక్ చాహర్ పెవిలియన్ చేర్చాడు. జడేజా వేసిన 15వ ఓవర్లో దినేశ్ కార్తీక్, షకీబ్ అల్ హసన్ ఔటవ్వడంతో మ్యాచ్ సీఎస్కే వశమైంది. చివర్లో శివం మావి 4,6,6తో ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది.