
చెన్నై: సన్రైజర్స్ హైదరాబాద్ సెన్సేషన్, అఫ్గాన్ మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్కు కోల్కతా నైట్ రైడర్స్ విధ్వంసకర బ్యాట్స్మెన్, విండీస్ వీరుడు ఆండ్రూ రస్సెల్ భయపడుతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వీరి మధ్య నమోదైన గణంకాలను పరిశీలించినా ఇదే విషయం స్పష్టం అవుతోంది. తాజాగా ఆదివారం జరిగిన మ్యాచ్లో రస్సెల్.. రషీద్ ఖాన్ బౌలింగ్లోనే ఔటయ్యాడు. సిక్సర్లు బాదకుండా ఎవరినీ వదిలిపెట్టని విండీస్ వీరుడు రషీద్ ఖాన్ బౌలింగ్లో మాత్రం తడబడుతున్నాడు. ఈ మ్యాచ్లో 7, 9, 13 ఓవర్లు వేసిన రషీద్కు కాసేపటి వరకు కెప్టెన్ డేవిడ్ వార్నర్ బంతినివ్వలేదు.
ఎప్పుడైతే రస్సెల్ క్రీజులోకి వచ్చాడో వెంటనే వార్నర్.. రషీద్ను రంగంలోకి దించాడు. అతను గూగ్లీకి మరోరూపమైన రాంగ్ అన్గా వేసిన 16.1 బంతిని రస్సెల్ లెగ్సైడ్ నుంచి బౌండరీకి వెళ్లింది. దాంతో వైడ్ల రూపంలో 5 పరుగులొచ్చాయి. ఆ తర్వాతా రషీద్ రాంగ్ అన్ వేసి పరుగు ఇవ్వలేదు. ఇక డిఫెన్స్ను ఛేదించేందుకు వచ్చిన రెండో బంతిని రసెల్ భారీ షాట్ ఆడాడు. లాంగ్ఆన్ మీదుగా గాల్లోకి లేచిన బంతిని మనీశ్ పాండే పరుగెత్తుకుంటూ వచ్చి సూపర్ ఫీల్డింగ్తో ఒడిసిపట్టాడు. దాంతో రస్సెల్ ఇన్నింగ్స్ ముగిసింది.
తాజా వికెట్తో రషీద్ ఖాన్ 48 బంతుల్లోనే రస్సెల్ను నాలుగు సార్లు పెవిలియన్ పంపినట్టు అయింది. ఈ మ్యాచ్కు ముందు టీ20 క్రికెట్లో రస్సెల్ను ఈ అఫ్గాన్ బౌలర్ మూడుసార్లు ఔట్ చేశాడు. నిన్నటి మ్యాచ్లో బౌలర్లంతా విఫలమైన వేళ రషీద్ ఖాన్ ఒక్కడే రాణించాడు. కానీ ఈ మ్యాచ్లో హైదరాబాద్ విజయాన్నందుకోలేకపోయింది. 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు సాధించింది. నితీశ్ రాణా (56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 80), రాహుల్ త్రిపాఠి (29 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లతో 53) మెరుపులు మెరిపించారు. రషీద్ ఖాన్, నబీ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు చేసి పరాజయం పాలైంది.
మనీశ్ పాండే (44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 61 నాటౌట్), జానీ బెయిర్స్టో (40 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 55) అర్ధ సెంచరీలతో పోరాడినా హైదరాబాద్ను విజయతీరానికి చేర్చలేకపోయారు. కోల్కతా బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ రెండు వికెట్లు తీయగా... కీలకమైన బెయిర్స్టో వికెట్ను కమిన్స్ దక్కించుకొని తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.