
హైదరాబాద్: సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్మేనేజ్మెంట్పై తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్లోని మిగతా ఫ్రాంచైజీలన్నీ తాము ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్రాల భాష, కల్చర్ను ఓన్ చేసుకుంటే.. సన్రైజర్స్ హైదరాబాద్ మాత్రం తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. లీగ్ ప్రారంభమై ఇన్నాళ్లు అయినా ఏనాడు సన్రైజర్స్ తెలుగు రాష్ట్రాల కల్చర్, భాషను ఓన్ చేసుకునే ప్రయత్నం చేయలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ టీమ్ స్లోగన్స్ చూస్తేనే ఈ విషయం అర్థమవుతుందని చెబుతున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ స్లోగన్ 'విజిల్ పొడు'.. ఆర్సీబీ అభిమానులు 'ఈసాల కప్నమ్దే'అంటున్నారని, ఇక రాజస్థాన్ రాయల్స్ 'హల్లా బోల్', కేకేఆర్ 'కొర్బో లొర్బో జీత్బో', పంజాబ్ హ్యాష్ ట్యాగ్ 'సద్దా పంజాబ్'గా ఉన్నాయని, సన్రైజర్స్కు మాత్రం తెలుగు స్లోగన్ ఎక్కడా? అని ప్రశ్నిస్తున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ తెలుగు టీమ్ కాదా? అని నిలదీస్తున్నారు. జట్టులోని విదేశీ ఆటగాళ్లే తెలుగు కల్చర్ను ఓన్ చేసుకుంటుంటే టీమ్ ఇంకెప్పుడు మేల్కొంటుందని మండిపడుతున్నారు. కనీసం తెలుగు ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకపోయినా? తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రముఖ తెలుగు కామెంటేటర్, క్రికెట్ అనలిస్ట్ వెంకటేశ్ ట్విటర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్మేనేజ్మెంట్ను నిలదీసారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. అయితే కేన్ మామనే మన స్లోగన్ అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. 'కింద మీద ఊపు.. హైదరాబాద్ తోపు'ను స్లోగన్గా పెట్టాలని ఫన్నీగా సూచిస్తున్నారు. ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ స్లోగన్ #OrangeorNothing ఉండగా.. #OrangeArmy హ్యాష్ ట్యాగ్ వాడుతుంది.
భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్లో సన్రైజర్స్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఏడు మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆరెంజ్ ఆర్మీ.. ప్లే ఆఫ్స్ చేరడం కష్టం. అద్భుతం జరిగితే తప్పా ఇది సాధ్యం కాదు. సెకండాఫ్లో ఏడు మ్యాచ్లకు ఏడు గెలిస్తేనే టోర్నీలో ముందడుగేసే పరిస్థితి. లేకుంటే మెరుగైన రన్రేట్తో 6 మ్యాచ్లోనైనా గెలవాలి. కానీ జట్టు ప్రస్తుత పరిస్థితి చూస్తే అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
ఫస్టాఫ్లో పంజాబ్ కింగ్స్పై గెలిచిన ఆరెంజ్ ఆర్మీ.. ఢిల్లీ క్యాపిటల్స్తో సూపర్ ఓవర్లో ఓటమిపాలైంది. సన్రైజర్స్ ఓడిన అన్ని మ్యాచ్లు సునాయసంగా గెలిచేవే. కానీ బలహీనమైన మిడిలార్డర్, పేలవ బ్యాటింగ్తో గెలిచే మ్యాచ్లను చేజార్చుకుంది. ఇక సెకండాఫ్ లీగ్ ప్రారంభానికి ముందు కీలక బెయిర్ స్టో సేవలను కోల్పోయింది. ఢిల్లీ క్యాపిటల్స్తో రేపు( బుధవారం) జరిగే మ్యాచ్తో సన్రైజర్స్ హైదరబాద్ సెకండాఫ్ లీగ్ను ప్రారంభించనుంది.