తీవ్ర ఒత్తిడిలో విరాట్ కోహ్లీ.. సీజన్ మధ్యలోనే ఆర్సీబీ కెప్టెన్సీకి గుడ్బై! తదుపరి కెప్టెన్ ఎవరంటే?

హైదరాబాద్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడా? సీజన్ మధ్యలోనే సారథ్య బాధ్యతలు వదులుకోనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్లో కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 9 వికెట్లతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ(4 బంతుల్లో 5)దారుణంగా విఫలమయ్యాడు. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది.
ఆ తర్వాత ఆర్సీబీ ఇన్నింగ్స్ పేకమేడల్లా 92 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఆర్సీబీ మరోసారి అత్యల్ప స్కోర్ నమోదు చేసిన అప్రతిష్టను మూటగట్టుకుంది. ఆ తర్వాత బౌలింగ్లోను తేలిపోయింది. ఏ మాత్రం పోరాట పటిమ చూపలేదు. ఇక ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. ఔటైన వెంటనే రివ్యూ తీసుకోవడం ఈ విషయాన్ని మరింత స్పష్టం చేసింది.

మరో ఓటమి ఎదురైతే..
అయితే ఇదే తరహాలో విరాట్ కోహ్లీ మరో మ్యాచ్లో విఫలమైతే మాత్రం సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం ఉందని ఓ మాజీ క్రికెటర్ ఐఏఎన్ఎస్తో అన్నాడు. కోహ్లీ తప్పుకోకపోయినా.. ఆర్సీబీ టీమ్మేనేజ్మెంట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగిస్తుందన్నాడు. కోహ్లీపై ఒత్తిడి తగ్గించేందుకే ఆర్సీబీ ఈ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నాడు. 'కోల్కతాతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆడిన వైఖరిని చూస్తేనే అతను ఎంత ఒత్తిడిలో ఉన్నాడో తెలుస్తుంది. సీజన్ మధ్యలోనే అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉంది.

కేకేఆర్ తరహాలో..
మిగతా జట్లలో కూడా ఇది జరిగిందే. కోల్కతా నైట్రైడర్స్ దినేశ్ కార్తీక్, సన్రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్లను మధ్యలోనే తొలగించాయి. ఆర్సీబీ మేనేజ్మెంట్ కూడా ఇలాంటి కఠిన నిర్ణయమే తీసుకోవచ్చు. కోల్కతాతో జరిగిన మ్యాచ్ను చూసిన తర్వాత నాకు ఇది జరుగుతుందనిపించింది. ఆర్సీబీకి మరో చెత్త మ్యాచ్ ఎదురైతే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడం ఖాయం'అని సదరు మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు. 2013లో ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టిన కోహ్లీ 132 మ్యాచ్ల్లో 62 మ్యాచ్లు గెలిపించాడు. మరో 66 మ్యాచ్ల్లో ఓటమిపాలవ్వగా.. నాలుగు మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు.

ఏబీ డివిలియర్స్కే పగ్గాలు..
సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకుంటే ఏబీ డివిలియర్స్ జట్టును నడిపంచే అవకాశాలున్నాయి. జట్టులో సీనియర్ ప్లేయర్గా, కెప్టెన్సీ చేసిన అనుభవం ఉన్న ఆటగాడిగా టీమ్మేనేజ్మెంట్ అతనికే అధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇక అంతర్జాతీయ క్రికెట్కు దూరమై కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ఏబీడీ.. ఈ ఆఫర్ను తిరస్కరిస్తే మాత్రం గ్లేన్ మ్యాక్స్వెల్కు అవకాశం దక్కవచ్చు. ఈ ఇద్దరి తర్వాత అంతర్జాతీయ క్రికెట్ అనుభవం ఉన్న ప్లేయర్ మ్యాక్సీవెల్ మాత్రమే. ఇక భారత ఆటగాడినే కెప్టెన్గా చేయాలంటే దేవదత్ పడిక్కల్ లేదా యుజ్వేంద్ర చాహల్కు అవకాశం దక్కవచ్చు.

సీజన్ తర్వాత గుడ్బై..
ఐపీఎల్ 2021 సెకండాఫ్ ప్రారంభానికి ముందే విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 14వ సీజన్ అనంతరం ఆర్సీబీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానన్నాడు. అయితే ఆటగాడిగా కొనసాగుతానని, తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆర్సీబీ తరఫునే ఆడుతానని స్పష్టం చేశాడు. అయితే ఐపీఎల్ 2021 సెకండాఫ్ ముందు కోహ్లీ తన నిర్ణయం ప్రకటించడం వల్ల బెంగళూరు ఆటగాళ్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందని గౌతమ్ గంభీర్తో సహా పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. హెడ్ కోచ్ మైక్ హెసెన్ మాత్రం అలాంటిదేం లేదని స్పష్టం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications