
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు సన్నదమవుతుంది. చెన్నైలో వేదికగా మరో రెండు రోజుల్లో ట్రైనింగ్ క్యాంప్ను ప్రారంభించనుంది. అయితే ఆ జట్టు సారథి విరాట్ కోహ్లీ ఈ ట్రైనింగ్ క్యాంప్కు ఆలస్యంగా రానున్నాడు. అతను ఏప్రిల్ 1న జట్టుతో కలిసే అవకాశం ఉందని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో తెలిపింది. ఇక ఆర్సీబీ తన సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో ఏప్రిల్ 9న తలపడనుంది. కరోనా నేపథ్యంలో ఈ సారి లీగ్ను 6 వేదికలకే పరిమితం చేయడంతో ఆర్సీబీ తమ ఆరంభ మ్యాచ్లను చెన్నైలోనే ఆడనుంది.
ఇంగ్లండ్తో మూడో వన్డే అనంతరం కోహ్లీ సోమవారం ఫుణెలోని బయో బబుల్ నుంచి బయటకు వచ్చేశాడు. బయో సెక్యూర్ వాతావరణంలోకి అడుగుపెట్టాలంటే ఐపీఎల్ మార్గదర్శకాల ప్రకారం కోహ్లీ తప్పనిసరిగా వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ సిరీస్ నేపథ్యంలో గత జనవరి చివరి వారం నుంచి కోహ్లీ బయో సెక్యూర్ బబులోనే ఉంటున్నాడు.
కోహ్లీతో పాటు వన్డే జట్టులో ఉన్న ఆర్సీబీ ఆటగాళ్లు యుజువేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్ సోమవారం మధ్యాహ్నం పుణె నుంచి నేరుగా చెన్నై చేరుకుంటారు. మంగళవారం నుంచి వీరిద్దరూ ట్రైనింగ్కు అందుబాటులో ఉంటారు. ఐపీఎల్ మార్గదర్శకాల ప్రకారం బయో బుబల్లో ఉన్న ఆటగాళ్లు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా సాధనలో పాల్గొనే వెసులుబాటు కల్పించారు. ఆ జట్టు స్టార్ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ కూడా ఏప్రిల్ 1న జట్టుతో చేరుతాడని ఆ జట్టు క్రికెట్ హెడ్ మైక్ హెసన్ ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే.