ఆఖరి వరకు పోరాడాలి
మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'మేం అలసిపోలేదు. జట్టును చూసి గర్వపడుతున్నాను. వికెట్ సవాల్ విసిరింది. గత రాత్రి కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మ్యాచులోనూ ఇలాగే జరిగింది. చెన్నై పిచ్ నెమ్మదిగా ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆఖరి వరకు పోరాడాలి. మాకు ఎక్కువ బౌలింగ్ వనరులు ఉన్నాయి. దాంతో మధ్య ఓవర్లలో ప్రభావం చూపించాం. మేము అదనంగా ఉపయోగించిన బౌలింగ్ ఆప్షన్లు మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపాయి' అని కోహ్లీ తెలిపాడు. ఈ మ్యాచులో కోహ్లీ 29 బంతుల్లో 4 బౌండరీల సాయంతో 33 పరుగులు చేశాడు.
మ్యాక్స్వెల్ ఇన్నింగ్సే హైలెట్
'మా వాళ్లకి నేను ఒక్కటే చెప్పా.. 149 పరుగుల స్కోరును చాలా ఇబ్బందిపడి సాధించామని అనుకోవద్దని చెప్పా. 150 పరుగుల లక్ష్యం కాపాడుకోవచ్చన్న విశ్వాసం నాకుంది. ఇన్ని పరుగులు చేయడం మనకు కష్టమైనప్పుడు అవతలి వాళ్లకూ అంతే కదా. వికెట్లు పోతున్నప్పుడు ఒత్తిడిలో ఛేదన ఎప్పుడూ సవాలే. ఎందుకంటే మ్యాచు ఎటువైపైనా మొగ్గు చూపొచ్చు. పాత బంతిని ఎదుర్కోవడం కఠినంగా అనిపించింది. పవర్ప్లేలో కొన్ని బౌండరీలు బాది జోరు కొనసాగించాలని భావించా. మా ఇన్నింగ్స్లో మ్యాక్స్వెల్ ఇన్నింగ్సే చాలా కీలకమైంది. మేం సాధిస్తున్న విజయాలకు పొంగిపోవడం లేదు. మా ప్రణాళికల్లో స్పష్టత ఉంది. ఒక్కో మ్యాచును లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతున్నాం' అని కోహ్లీ పేర్కొన్నాడు.
రెండు మ్యాచుల్లో ఓడటం నిరాశపరిచింది
'ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టం. మా బౌలర్లు ప్రత్యర్థిని అద్భుతంగా నిలువరించారు. మాక్స్వెల్ మాత్రం బాగా బ్యాటింగ్ చేశాడు. చివర్లో నిలదొక్కుకున్న బ్యాట్స్మెన్ ఇద్దరు క్రీజులో ఉండాలని భావించాం. కానీ మేం అందులో విఫలమయ్యాం. భాగస్వామ్యాలు నిర్మించి చక్కని క్రికెట్ షాట్లు ఆడటం అవసరం. చెత్త షాట్లు ఆడాం. ఇక్కడ అలా ఆడకూడదు. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడటం నిరాశపరిచింది. మున్ముందు మ్యాచుల్లో ఎలా ఆడాలో మాకు తెలుసు. ఇదే వేదికలో మాకు మరో మూడు మ్యాచులు ఉన్నాయి. పిచ్లు మెరుగవుతాయని భావిస్తున్నాం. పవర్ప్లే ఓవర్లలో తక్కువ నష్టం జరిగేలా బంతులు విసిరాలన్నది మా ప్రణాళిక. చెపాక్లో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే నాలుగు మ్యాచులు గెలవాల్సింది' అని సన్రైజర్స్ సారథి డేవిడ్ వార్నర్ చెప్పాడు.
SRH vs RCB: విరాట్ కోహ్లీ ఆవేశం.. మ్యాచ్ రిఫరీ మందలింపు! అసలేంజరిగిందంటే?