
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్కు శుక్రవారం తెరలేవనుంది. ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్కు చెన్నైలోని చెపాక్ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే, ఆర్సీబీ ఆటగాళ్లందరూ క్వారంటైన్ గడువు పూర్తి చేసుకోవడంతో ప్రాక్టీస్కు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ బుధవారం జట్టు సభ్యులతో మాట్లాడాడు. కొత్తగా ఈ ఏడాది జట్టులోకి వచ్చిన వారికి స్వాగతం పలుకుతూ వారి నుంచి తనకేం కావాలో వివరించాడు.
'ఆర్సీబీలో చేరిన కొత్త కుర్రాళ్లందరికీ ఈ అద్భుత టీమ్లోకి వెల్కమ్. గతంలో ఈ జట్టులో ఆడిన ఆటగాళ్ల నుంచి ఇక్కడెలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకునే ఉంటారు. ఈ వాతావరణం, ఈ జోష్ సీజన్ మొత్తం ఇలాగే ఉంటుంది. నేను మీ నుంచి ఆశించేది ఒకే ఒక్క విషయం. అదేమిటంటే.. మైదానంలోనే ఎక్కువ సమయం గడపడం. అది ప్రాక్టీస్ సెషన్స్ అయినా ఇంకేదైనా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీరు సంపూర్ణ ఆసక్తి చూపిస్తారని నేను ఆశిస్తున్నా. మేం ఎప్పుడూ ఇలాగే ఉంటాం. ఇదెప్పుడూ మారదు' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
'అలాగే గతేడాది మేం చాలా బాగా ఆస్వాదించాం. ముఖ్యంగా ప్రాక్టీస్ సెషన్స్లో సరదాగా ఉండటంతో పాటు ఎంతో కష్టపడ్డాం. ఎవరూ డుమ్మా కొట్టడం కానీ, సమయం వృథా చేయడం కానీ చేయలేదు. మేం ప్రొఫెషనల్ క్రికెటర్లము కాబట్టి మాకేం కావాలనే విషయంపై స్పష్టంగా ఉన్నాం. అలాగే మంచి ఫన్ కూడా దొరికింది. ఇప్పుడు మిమ్మల్ని.. నేను, టీమ్మేనేజ్మెంట్ నమ్ముతోంది. ఆర్సీబీకి ఏం కావాలో అది సాధించడానికి మీరు కృషి చేస్తారని భావిస్తున్నాం. మీకేం కావాలన్నా నాతో పాటు టీమ్మేనేజ్మెంట్ అండగా ఉంటుంది.
ఈ సీజన్లో మనమంతా ఒక నమ్మకంతో ఉంటే కచ్చితంగా అద్భుతాలు సృష్టిస్తాం. అందుకోసం అందరూ సిద్ధంగా ఉండాలి. నేను కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నా. కాబట్టి మనం ఈ టోర్నీని గ్రాండ్గా మొదులుపెడ్దాం'అని కోహ్లీ తెలిపాడు. ఇక ఆర్సీబీ ఈ సీజన్ వేలానికి ముందు అత్యధికంగా 10 మంది ఆటగాళ్లను వదులుకుంది. అలాగే వేలంలో మాక్స్వెల్ వంటి కీలక ఆల్రౌండర్తో పాటు కైల్ జేమీసన్, కేన్ రిచర్డ్సన్లను కొనుగోలు చేసింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ సీజన్లోనైనా కోహ్లీసేన అద్భుతం చేస్తుందో లేదో చూడాలి.