న్యూఢిల్లీ: ఐపీఎల్-14వ సీజన్కు కరోనా సెగ గట్టిగానే తాకింది. ఊహించని విధంగా ఇద్దరూ ఆటగాళ్లు, ఓ కోచ్ కరోనా బారిన పడటంతో ఈ క్యాష్ రిచ్ లీగ్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఓ మ్యాచ్ను వాయిదా వేసిన బీసీసీఐ.. లీగ్కు కొన్ని రోజులు విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నేడు(మంగళవారం) సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్ ముగిసిన అనంతరం ఐపీఎల్ 2021 సీజన్ను తాత్కలికంగా వాయిదా వేయనున్నారని బోర్డు వర్గాలు తెలిపాయి.
కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తీ, సందీప్ వారియర్లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరితో సన్నిహితంగా ఉన్న కేకేఆర్ ఆటగాళ్లంతా ఐసోలేషన్లోకి వెళ్లారు. అంతేకాకుండా కోల్కతాతో ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ కూడా స్వీయ నిర్భంధం పాటిస్తుంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్, బస్ డ్రైవర్కు కరోనా పాజిటీవ్ రాగా.. వారితో సన్నిహితంగా ఉన్న ఆటగాళ్లంతా క్వారంటైన్లోకి వెళ్లారు. వాళ్లంతా దాదాపు వారం రోజులు ఐసోలేషన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దాంతో చెన్నై, కేకేఆర్, ఢిల్లీ ఆడే తదుపరి మ్యాచ్లపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలోనే లీగ్ను తాత్కలికంగా వాయిదా వేయడమే ఉత్తమమని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. లీగ్ను తాత్కలిక వాయిదా వేయడం ఖాయమని ఆజ్ తక్ చానెల్ పేర్కొంది. ఓ వారం రోజుల బ్రేక్ అనంతరం అప్పటి పరిస్థితులను బట్టి లీగ్ కొనసాగించాలా? వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమచారం.