
హైదరాబాద్: సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు గుడ్ న్యూస్. ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్ ముంగిట సన్రైజర్స్ ఆటగాళ్లంతా మంచి టచ్లోకి వచ్చారు. తాజాగా జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో అద్భుత ఆటతీరు కనబర్చారు. ముఖ్యంగా టీమ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 61)హాఫ్ సెంచరీతో చెలరేగగా.. మనీశ్ పాండే(26 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 47), శ్రీవాత్స్ గోస్వామి(30 బంతుల్లో 4 సిక్స్లతో 44), విరాట్ సింగ్(21 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 39) మంచి ఫామ్ కనబర్చారు. జట్టులోకి కొత్తగా వచ్చిన వెస్టిండీస్ హిట్టర్ రూథర్ ఫోర్డ్(13 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 37) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్లో జాసన్ హోల్డర్ (2/21), నదీమ్(2/21), సమద్(2/17), రషీద్(1/10) రాణించారు.
జట్టులోని ఆటగాళ్లు టీమ్ భువీ, టీమ్ కేన్ పేరిట రెండుగా విడిపోయి సన్నాహక మ్యాచ్ ఆడాయి. అయితే ఈ మ్యాచ్లో భువీ టీమే 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భువీ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 రన్స్ చేసింది. భువీ టీమ్ తరఫున గోస్వామి, విరాట్ సింగ్, రూథర్ ఫోర్డ్ టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేన్ టీమ్ బౌలర్లలో నదీమ్, సమద్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేన్ టీమ్.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 151 రన్స్ మాత్రమే చేసి ఓటమిపాలైంది. కేన్ మామా హాఫ్ సెంచరీతో రాణించగా.. మనీశ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భువీ టీమ్ బౌలర్లలో హోల్డర్ 2 వికెట్లు తీయగా.. రషీద్ ఓ వికెట్ తీశాడు. స్కోర్ బోర్డుకు సంబంధించిన వివరాలతో పాటు ప్రాక్టీస్ మ్యాచ్ వీడియోను సన్రైజర్స్ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్లో సన్రైజర్స్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఏడు మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆరెంజ్ ఆర్మీ.. ప్లే ఆఫ్స్ చేరడం కష్టం. అద్భుతం జరిగితే తప్పా ఇది సాధ్యం కాదు. సెకండాఫ్లో ఏడు మ్యాచ్లకు ఏడు గెలిస్తేనే టోర్నీలో ముందడుగేసే పరిస్థితి. లేకుంటే మెరుగైన రన్రేట్తో 6 మ్యాచ్లోనైనా గెలవాలి. కానీ జట్టు ప్రస్తుత పరిస్థితి చూస్తే అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
ఫస్టాఫ్లో పంజాబ్ కింగ్స్పై గెలిచిన ఆరెంజ్ ఆర్మీ.. ఢిల్లీ క్యాపిటల్స్తో సూపర్ ఓవర్లో ఓటమిపాలైంది. సన్రైజర్స్ ఓడిన అన్ని మ్యాచ్లు సునాయసంగా గెలిచేవే. కానీ బలహీనమైన మిడిలార్డర్, పేలవ బ్యాటింగ్తో గెలిచే మ్యాచ్లను చేజార్చుకుంది. ఇక సెకండాఫ్ లీగ్ ప్రారంభానికి ముందు కీలక బెయిర్ స్టో సేవలను కోల్పోయింది. ఢిల్లీ క్యాపిటల్స్తో రేపు( బుధవారం) జరిగే మ్యాచ్తో సన్రైజర్స్ హైదరబాద్ సెకండాఫ్ లీగ్ను ప్రారంభించనుంది.