
హైదరాబాద్: సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు గుడ్ న్యూస్.. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ నుంచి తప్పుకున్న స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ స్థానంలో ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాట్స్మన్ జాసన్ రాయ్ జట్టులోకి వచ్చాడు. ఈ విషయాన్ని సన్రైజర్స్ హైదరాబాదే బుధవారం అధికారికంగా ప్రకటించింది. మిచెల్ మార్ష్ దూరమయ్యాడనే బాధలో ఉన్న అభిమానులకు గంటలో వ్యవధిలోనే గుడ్ న్యూస్ చెప్పింది. ట్విటర్ వేదికగా జాసన్ రాయ్కు స్వాగతం పలికింది. ఇక వ్యక్తిగత కారణాలతో మిచెల్ మార్ష్ ఐపీఎల్ 2021 సీజన్ నుంచి తప్పుకున్నాడని స్పష్టం చేసింది.
కరోనా నేపథ్యంలో కఠిన బయో బబుల్లో ఉండటం కష్టంగా భావించిన మిచెల్ మార్ష్ ఐపీఎల్ 2021 సీజన్కు దూరంగా ఉండాలని భావించాడు. కొద్ది రోజుల క్రితమే ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)తో పాటు సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్మేనేజ్మెంట్కు తెలియజేశాడు. ఐపీఎల్ బయో సెక్యూర్ నిబంధనల ప్రకారం.. మార్ష్ ఏడు రోజుల క్వారంటైన్తో పాటు 50 రోజుల కఠిన బయో బబుల్లో ఉండాలి. దీన్ని కష్టంగా భావించిన అతను లీగ్ నుంచి తప్పుకోవడమే ఉత్తమమని భావించాడు.ఇక ఈ వార్త బయటకు వచ్చి గంటల వ్యవధిలోనే సన్రైజర్స్ హైదరాబాద్.. అతని స్థానంలో జాసన్ రాయ్ను తీసుకొని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఇటీవల భారత్తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లో జాసన్ రాయ్ అదరగొట్టాడు. ఐదు టీ20ల సిరీస్లో 49, 46, 9, 40, 0లతో మెరుపులు మెరిపించాడు. ఇక మూడు వన్డేల సిరీస్లో 46, 55, 14లతో చెలరేగాడు. ప్రస్తుతం ఫుల్ఫామ్లో ఉన్న జాసన్ రాయ్.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఉపయోగపడనున్నాడు. అయితే విదేశీ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్న క్రమంలో తుది జట్టులో అతనికి అవకాశం దక్కడం కష్టమే.
గతంలో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడిన జాసన్ రాయ్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఈ సీజన్ కోసం జరిగిన వేలంలో అతనిపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. దాంతో అతను అమ్ముడుపోని ఆటగాడిగా నిలిచిపోయాడు. కానీ మార్ష్ రూపంలో అతనికి మరో అవకాశం దక్కింది. మరీ ఈ సీజన్లోనైనా మెరుపులు మెరిపిస్తాడో లేదో చూడాలి.