
న్యూఢిల్లీ: కరోనా కష్టకాలంలో స్టార్ ఇండియా ఉదారత చాటుకుంది. తమ స్పాన్సర్లు, ప్రకటనకర్తలకు అండగా నిలిచింది. ఐపీఎల్ 2021 సీజన్ అర్దంతరంగా వాయిదాపడటంతో జరిగిన మ్యాచ్లకే డబ్బులు చెల్లించాలని స్పష్టం చేసింది. 2018-2022 ఐదు సంవత్సరాలకు గాను స్టార్ స్పోర్ట్స్ ఛానల్.. ఐపీఎల్ టెలివిజన్, డిజిటల్ ప్రసార హక్కులను రూ.16,348 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక్కో మ్యాచ్కు రూ.54.5 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మ్యాచ్లు జరిగేటప్పుడు విరామ సమయాల్లో ప్రకటనల కోసం స్టార్ ఇండియా.. పలు బ్రాండ్లు, స్పాన్సర్లకు టైమ్స్లాట్లను పెద్ద మొత్తంలో అమ్ముకుంది.
ఇక ఈ సీజన్లో మొత్తం 60 మ్యాచ్లు జరగాల్సి ఉండగా.. ఇప్పటివరకు 29 మ్యాచ్లే జరిగాయి. ఇంకా 31 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. దాంతో ప్రకటనకర్తలు, స్పాన్సర్లు భారీ ఎత్తున నష్టపోయే ప్రమాదం వాటిల్లింది. ఈ నేపథ్యంలోనే స్పందించిన స్టార్ మేనేజ్మెంట్... ఆయా స్పాన్సర్లు, ప్రకటనకర్తలను ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల వరకే డబ్బు చెల్లింపులు జరపాలని కోరింది. మిగతా వాటికి.. బీసీసీఐ తిరిగి ఎప్పుడు మిగిలిన మ్యాచ్లను కొనసాగిస్తుందో అప్పుడే చెల్లించాలని స్పష్టం చేసింది.
'ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో స్టార్ ఇండియా మా ప్రకటన కర్తలను, వారి ఏజెన్సీలను సంప్రదించింది. ఈ సీజన్లో జరిగిన మ్యాచ్లకే చెల్లింపులు జరపాలని కోరింది. మిగతావి తిరిగి మ్యాచ్లు నిర్వహించేటప్పుడు చెల్లించొచ్చని స్పష్టం చేసింది' అని సంబంధిత అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
ఇదిలా ఉండగా, గతేడాది ఐపీఎల్తో పోలిస్తే ఈసారి టీవీ వీక్షకుల సంఖ్య మరింత పెరిగింది. 2020లో 349 మిలియన్ల మంది వీక్షించగా ఈసారి ఆ సంఖ్య 352 మిలియన్లుగా నమోదైందని బార్క్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ విషయం పట్ల తాము సంతోషంగా ఉన్నా.. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో టోర్నీని వాయిదా వేయటమే మంచిదని స్టార్ ఇండియా ప్రతినిధి తెలిపారు. అందరూ క్షేమంగా ఉండాలనే తాము కోరుతున్నామని చెప్పారు. కాగా, గతవారం ఐపీఎల్ బయోబుడగలో పలువురు ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఈ సీజన్ మధ్యలోనే వాయిదాపడిన విషయం తెలిసిందే.